షాబాద్, మే 8 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో మొత్తం 11,130 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 461 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 449 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు.
413 గ్రామాలు, 79 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు
బొంరాస్పేట : వికారాబాద్ జిల్లాలో 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలున్న వారికి చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. మంగళవారం 4973 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 496 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 617 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 413 గ్రామాలు, 79 వార్డుల్లో వైద్య శిబిరాలను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
రుణపడి ఉంటాం : అనిల్కుమార్, ఊరెళ్ల, చేవెళ్ల మండలం
మా ఊర్లోనే ప్రభుత్వం కంటి వెలుగు శిబిరం ఏర్పాటు చేశారని తెలుసుకొని కంటి పరీక్షలు చేయించుకున్నా. పైసా ఖర్చు లేకుండా మందులు, అద్దాలు ఉచితంగా ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమం చేపట్టిన సీఎం కేసీఆర్ సార్కు నమస్కారాలు. గతంలో ఏ ప్రభుత్వాలూ ఇంత మంచి కార్యక్రమం పెట్టలేదు. పేదల సంక్షేమానికి సీఎం సారు సాయపడుతున్నారు. ఆయనకు అందరం రుణపడి ఉంటాం.