ఈ నెల 18వ తేదీ నుంచి రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనుండగా, రంగారెడ్డి జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కంటి పరీక్షలు నిర్వహించేందుకు జిల్లావ్యాప్తంగా 80 బృందాలను ఏర్పాటు చేశారు. కంటి సమస్యలు ఉన్నవారికి ఉచితంగా చికిత్స అందించడంతోపాటు అవసరమైనవారికి మందులు, అద్దాలు పంపిణీ చేయనున్నారు. ఈ విషయమై ఇప్పటికే డాటాఎంట్రీ ఆపరేటర్లు, ఇతర వైద్య సిబ్బందికి అధికారులు శిక్షణ కూడా ఇచ్చారు.
ఇబ్రహీంపట్నం, జనవరి 2 : రాష్ట్ర ప్రభుత్వం అంధత్వ నివారణతో పాటు ప్రతిఒక్కరికీ కంటి సమస్యలకు సంబంధించిన వ్యాధులను మటుమాయంచేసి సంపూర్ణ చూపు నివ్వాలన్న ఉద్దేశంతో చేపట్టనున్న కంటివెలుగు కార్యక్రమ ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముమ్మరంగా పనులు కొనసాగిస్తున్నారు. గ్రా మీణ ప్రాంతాల్లో కంటిచూపునకు దూరమవుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. వారిని గుర్తించి అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించడంతో పాటు కం టి అద్దాలను అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆర్థికంగా లేని వారి కంటి చూపునకు దూరం కాకుండా ఉండాలనే సీఎం కేసీఆర్ ధ్యేయంగా ముందుకెళ్తున్నారు.
గ్రామాల్లో క్యాంపులు.. ఉచితంగా చికిత్సలు
జిల్లా వ్యాప్తంగా ఈనెల 18నుంచి కంటివెలుగు కార్యక్రమం ద్వారా గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి కంటి వ్యాధులున్న వారికి అవసరమైన చికిత్సలు ఉచితంగా జరపాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటి నుంచే గ్రామాల్లో కంటి సమస్యలున్న వారిని గుర్తించే కార్యక్రమానికి జిల్లా వైద్యారోగ్యశాఖ శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి జిల్లాలో కంటి సమస్యలున్న వారిని గుర్తించేందుకు 80టీంలను ఏర్పాటు చేశారు. ఈ టీంలో డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆప్తమాలజిస్టులు, కంటివైద్యులు సభ్యులుగా ఉన్నారు. ఈ టీంలు ఆయా గ్రామాలకు వెళ్లి ప్రతిరోజూ కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ టీంలు పనిచేయనున్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ఇంటింటికీ వెళ్లి సర్వే చేయనున్నారు. ఈ సర్వేకు వెళ్లిన టీంలు ఆయా గ్రామాల్లోని ప్రజాప్రతినిధులతో కలిసి కంటి సమస్యలున్న వారిని ఎంపిక చేయనున్నారు. కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో వైద్యులు, ఇతర సిబ్బంది ఆశవర్కర్లు, ఏఎన్ఎమ్లు పాల్గొననున్నారు.
మొదటి విడుత శిక్షణ పూర్తి..
కంటివెలుగు కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించనున్న డాటాఎంట్రీ ఆపరేటర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. కంటి సమస్యలతో వైద్య శిబిరానికి వచ్చే రోగుల ఆధార్ నంబర్లు, సెల్ నంబర్ల ఆధారంగా వారి వివరాలను కంటివెలుగు పోర్టల్లో పొందుపర్చేలా శిక్షణ ఇచ్చారు. కంటివెలుగు నిర్వహణలో అవసరమైన సాంకేతిక అంశాలతో పాటు రోగులకు అందించే చికిత్స తదితర అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. రాష్ట్రస్థాయి అధికారి అన్నపూర్ణ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు. కంటివెలుగు సేవలను ఆన్లైన్ ద్వారా అందించేందుకు వైద్యాధికారులు కసరత్తు మొదలెట్టారు.
ఆన్లైన్ విధానం ద్వారా సేవలు
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కంటివెలుగు కార్యక్రమాన్ని పూర్తిగా ఆన్లైన్ విధానం ద్వారా సేవలందించనున్నారు. తెలంగాణ కంటివెలుగు పోర్టల్ ద్వారా క్షేత్రస్థాయిలో నిర్వహించనున్నారు. కంటి సమస్యలతో క్యాంపులకు హాజరైన వారి ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ఆధారంగా పూర్తి వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఈ ఆన్లైన్లో ఉన్న వారికి సంబంధిత వైద్యసిబ్బంది ఫోన్ ద్వారా తెలుసుకుని వారి సమస్యలకు ఆన్లైన్లోనే వైద్యసదుపాయం అందించనున్నారు. గ్రామాల్లో నిర్వహించే కంటివెలుగుకు సంబంధించిన రోగులను గుర్తించి వారందరినీ ఆన్లైన్ పోర్టల్లో చేర్చనున్నారు. వీరికి అవసరమైన వైద్యం అందించేందుకు ఎంతో దోహడపడుతుందని వైద్యారోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు.
ఇంటింటికీ వెళ్లి వివరాల నమోదు
జిల్లాలో ఈనెల 18నుంచి నిర్వహించనున్న కంటివెలుగు కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కంటి సమస్యలతో బాధపడుతున్న వారి వివరాలను ఆన్లైన్లో పొందుపచ్చేందుకు 80టీంలను ఏర్పాటు చేశాం. ఈ టీంలు ఇంటింటికీ వెళ్లి కంటి సమస్యలున్న వారి వివరాలు నమోదు చేయనున్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారి సమస్యలు పరిష్కరిస్తాం.
– వెంకటేశ్వర్రావు, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి