షాబాద్/మొయినాబాద్ , జనవరి 23: కంటి పరీక్షలను పకడ్బందీగా చేపట్టాలని రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన మండలంలోని చందనవెళ్లిలో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంపును పరిశీలించారు. ప్రజలకు చేస్తున్న కంటి పరీక్షలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ప్రభుత్వ దవాఖానను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేసేందుకు ప్రభు త్వం కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
జిల్లాలో 80 బృందాలతో గ్రామాలు, పట్టణాల్లో క్యాంపులు కొనసాగుతున్నాయని.. ఈ కార్యక్రమం వంద రోజులపాటు ఉంటుందన్నారు. అనంతరం ఆయన చందనవెళ్లిలో కన్సర్న్ ఇండియా ఫౌండేషన్ ద్వారా నిర్మిస్తున్న దవాఖాన నూతన భవనాన్ని పరిశీలించారు. చేవెళ్లలోని పాలియేటివ్ కేర్ సెంటర్ను సందర్శించి అక్కడి సిబ్బందితో మాట్లాడారు. అదేవిధంగా డీఎంహెచ్వో మొయినాబాద్ మండలంలోని చిలుకూరు, మొయినాబాద్ గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమం ఎలా జరుగుతున్నదని అక్కడి వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. రాష్ట్రం లో అంధత్వ నివారణ కోసమే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ దామోదర్, సీహెచ్వో గోపాల్రెడ్డి, చిలుకూరు సర్పంచ్ గునుగుర్తి నక్షత్రం, మెడికల్ ఆఫీసర్ వాణి, సీహెచ్వో నర్సింగ్రావు, కార్యదర్శి వెంకటేశ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పేదలకు వరం..
కంటి వెలుగు కార్యక్రమం పేదలకు వరంలా మారింది. గ్రామాల్లోనే కంటి వెలుగు క్యాంపులను ఏర్పాటు చేసి వైద్యు లు పరీక్షించి అవసరమైన మందు లు, అద్దాలు ఇస్తుండటం చాలా సంతోషంగా ఉన్నది. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారు. ప్రజలు క్యాంపునకు వచ్చి పరీక్షలు చేయించుకుని అవసరమైన మందులు, అద్దాలు తీసుకెళ్తున్నారు.
-తండగిపల్లి పోచయ్య, కమ్మెట గ్రామం, చేవెళ్లటౌన్