రంగారెడ్డి, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): నిత్యావసరాల ధరలు చుక్కలన్నంటడంతో సామాన్యుల బతుకులు ఆగమవుతున్నాయి. దీనికితోడు ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతుండడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఏడాది వ్యవధిలోనే కందిపప్పు ధర దాదాపు 50 శాతం, బియ్యం ధరలు 25 శాతం వరకు పెరిగాయి. ఇక కూరగాయలు ధరలు కూడా ఆకాశాన్నంటుండడంతో పేదలు రేషన్ బియ్యం, పచ్చడి మెతుకులతో కాలం వెళ్లదీస్తున్నారు. ఆదాయం ఇసుమంత ఉంటే.. ఖర్చులు మాత్రం కొండంత ఉన్నాయని, పెరిగిన ధరలతో నెలనెలా వచ్చే జీతం ఏ మూలకూ సరిపోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసి నిత్యావసరాలు కొనాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఆహార పంటల సాగు తగ్గడం.. వ్యాపారులు నిత్యావసరాలను అక్రమంగా నిల్వ చేయడమే ధరల పెరుగుదలకు ప్రధానం కారణంగా తెలుస్తున్నది. పౌర సరఫరాల శాఖ అధికారులు ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజానీకం కోరుతున్నది.
ఒక పక్క ఇంటి అద్దెలు.. మరోపక్క పిల్లల చదువులు.. ఇంకో పక్క అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ప్రజానీకానికి పెరిగిన నిత్యావసర, భగ్గుమంటున్న కూరగాయల ధరలు శరాఘాతంలా మారాయి. ఏడాది వ్యవధిలో కంది పప్పు ధర దాదాపు 50 శాతం పెరిగితే.. బియ్యం 13-25 శాతం వరకు పెరిగింది. నెలనెలా వచ్చే అరకొర జీతం అవసరాలకు సరిపోక అప్పుల పాలవుతున్న పరిస్థితుల్లో కుటుంబ నెల బడ్జెట్ తలకిందులవుతున్నది. జీవనాన్ని సాగించడం పెద్ద యుద్ధంగా మారిపోయిందని జిల్లాలోని పేద, మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఆహార పంటల సాగు తగ్గడం.. వ్యాపారులు నిత్యావసరాలను అక్రమంగా నిల్వచేయడం ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తున్నది.
ధరలు మరింత పైపైకి..
కొండెక్కిన పప్పులు.. భగ్గుమంటున్న కూరగాయలు.. మరుగుతున్న నూనెలు ఇలా మార్కెట్లో ధరల దరువు చుక్కలను తాకుతున్నది. పెరుగుతున్న నిత్యావసర ధరలతోపాటు అన్ని రకాల ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. అసలే ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్న పేదలపై ధరల పెరుగుదల పెనుభారాన్ని మోపుతున్నది. పౌరసరఫరాల శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం.. చక్కెర ధర కిలో 7 శాతం (రూ.39.09 నుంచి రూ.41.95కి), చింతపండు గ్రేడ్-1 రకం కిలోకు రూ.15.08 శాతం (రూ.118.50 నుంచి రూ.136.37), గ్రేడ్-2 రకం ధరలు 17.31శాతం (రూ.100.69 నుంచి రూ. 118.11కి) పెరిగాయి. సూపర్ ఫైన్ బియ్యం కిలో ధర ప్రస్తుత మార్కెట్లో రూ. 62, రూ.70గా ఉన్న ది. కిరాణా షాపుల్లో ఈ ధరలు మరింత అధికంగా ఉన్నాయి. ఉల్లిగడ్డలు గతేడాది డిసెంబర్లో కిలో రూ.27.19 ఉండగా..ఈ ఏడాది నవంబర్లో రూ. 46.97గా ఉన్నది. డిసెంబర్లో కాస్తంత తగ్గింది. అధికారులు ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజానీకం కోరుతున్నది.
నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతున్నది. మా ర్కెట్లో బియ్యం, పప్పులు, కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పెరిగిన ధరలతో సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ధరల పర్యవేక్షణ కమిటీ ప్రతి మూడు నెలలకొక మారు సమావేశాలు నిర్వహిస్తున్నామని ప్రకటిస్తున్నా ఫలితంలేదు. ధరలపై నియంత్రణ లేకపోతే వచ్చే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
-కొమ్ము ప్రసాద్, యువజన విభాగం నాయకుడు, ఆమనగల్లు
ధరలను అదుపు చేయాలి
ప్రస్తుతం మార్కెట్లో అన్ని రకాల నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. ఏది కొనాలన్నా కిలోకు రూ. 60 పైగానే ఉన్నాయి. కిలో కొనే చోట పావుకిలోతో సరిపెట్టుకోవాల్సి వస్తున్నది. పప్పులు, పిండి, నూనెతోపాటు బియ్యం ధరలు కూడా అదే మాదిరిగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి నిత్యావసర ధరలను నియంత్రించాలి.
-కారు చెన్నయ్య,బోడంపహాడ్, షాబాద్
ఎలా జీవించాలో అర్థం కావడంలేదు
ఏమి కొనేటట్లు లేదు.. ఏమి తినేటట్లు లేదు అన్న చందంగా నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి. ప్యాకెట్ నిండా నగదు తీసుకెళ్లినా సంచి నిండా సరుకులు రావడం లేదు. సంపాదించిన మొత్తంలో ఎక్కువ భాగం నిత్యావసరాలకే వెచ్చితే ఎలా జీవించాలో అర్థం కావడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిత్యావసర సరుకుల ధరలను అదుపులోకి తీసు కు రావాలి.