ఆమనగల్లు, ఫిబ్రవరి 11 : విజయ పాల ఉత్పత్తిదారులకు ప్రభుత్వం ప్రకటించిన లీటరు రూ.4 ప్రోత్సాహక నగదు బకాయి డబ్బులను వెంటనే విడుదల చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు. శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే ప్రస్తావించారు. ప్రోత్సాహక నగదు నెలల కాలంగా అందక పాల ఉత్పత్తిదారులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. కడ్తాల పాల శీతలీకరణ కేంద్రం పరిధిలో సబ్సిడీ పాడి ఆవులను సరఫరా చేయకపోవడంతో చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రావిరాల వద్ద నిర్మిస్తున్న మెగా డెయిరీని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. సమస్యలు పరిశీలించి పరిష్కారిస్తామని మంత్రి శ్రీనివాస్యాదవ్ సమాధానమిచ్చారు. సమస్యలను అసెంబ్లీ వేదికగా సర్కారు దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యేకు కడ్తాల పాలశీతలీకరణ కేంద్రం పరిధి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
కోట్పల్లి : జిల్లాలోని అనంతపద్మనాభస్వామి ఆలయం రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందని.. అలాగే బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం కూడా ఉందని అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. ఈ ఆలయాలకు సమీపంలో కోట్పల్లి, సర్పన్పల్లి ప్రాజెక్టు ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టుల్లో బోటింగ్కు పలు ప్రాంతాల నుంచి పెద్దమొత్తంలో పర్యాటకులు వస్తుంటారని తెలిపారు. ఇది మంచి పిక్నిక్ స్పాట్గా ఉందన్నారు. అనంతగిరి ఆలయం పరిధిలోనే 60 ఎకరాల స్థలాన్నిఆలయానికి ఇచ్చి ఈకో టూరిజం చేస్తే ఇక్కడి పర్యాటకులు వేరే రాష్ర్టాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ప్రస్తావించారు. అలాగే వికారాబాద్లో మినీ స్టేడియంతో పాటు కోట్పల్లి, మర్పల్లి, బంట్వారం మండల కేంద్రాల్లో మినీ స్టేడియంలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు. వికారాబాద్ నుంచి జిన్నారంకు డబుల్ రోడ్డు వేయాలని, బార్వాద్- మాలసోమారం మధ్య బ్రిడ్జీ నిర్మాణం, పల్లె దవాఖానాల ఏర్పాటుపై అసెంబ్లీలో ప్రస్తావించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.