పరిగి, జూన్ 11 : ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు లాక్కోవద్దంటూ మండలంలోని కాళ్లాపూర్ రైతులు గురువారం ఆమరణదీక్ష చేపట్టారు. కాళ్లాపూర్ పరిధిలో 428.05 ఎకరాల అసైన్డ్, 159.25 ఎకరాల పట్టా భూమిని సేకరించేందుకు ప్రభుత్వం గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేయడంతో గ్రామంలో ఒక్కసారిగా అలజడి ప్రారంభమైంది. తమ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను సర్కారు గుంజుకుంటుందని తెలియడంతో భయాందోళనకు గురవుతున్నారు.
తమ భూములు లాక్కోవద్దంటూ స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్డ్డిని కలిసి వేడుకున్నారు. ఆయన నుంచీ ఎలాంటి హామీ లభించలేదు. రైతుల భూములను లాక్కొనేందుకు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి రైతులను కలిసి వారు చేపడుతున్న ఆందోళనకు మద్దతు ప్రకటించారు. గ్రామంలో రిలే రిలేదీక్షలు చేపట్టారు. తహసీల్దార్, ఆర్డీ వో, కలెక్టర్, రాష్ట్ర గవర్నర్నూ కలిసి తమ భూములు ప్రభుత్వం గుంజుకోకుండా చూడాలని విన్నవించా రు. అయినా ప్రభుత్వం ఈనెల 12వ తేదీన కాళ్లాపూర్లో భూసేకరణ గ్రామసభ నిర్వహణకు సిద్ధం కావడంతో రైతులు మరోసారి గ్రామంలో సమావేశమయ్యారు.
తాము భూములను ఇచ్చేదిలేదని చెప్పినప్పుడు తమ ఊరిలో గ్రామసభ నిర్వహించరాదని, తమ భూములను గుంజుకోరాదంటూ గురువారం నుంచే ఆమరణదీక్ష ప్రారంభించారు. సర్పంచ్ పులిందర్, ఉపసర్పంచ్ గాండ్ల రమేశ్, పరిగి భానుచందర్, సోమగారి రమేశ్, సోమగారి జంగ య్య, కరోళ్ల బాలయ్యలు ఆమరణదీక్ష చేపట్టగా, వారికి మద్దతుగా భూములు కోల్పోతున్న రైతులు దీక్షలో పాల్గొన్నారు. తమ ప్రాణాలైనా వదులుకుంటాం తప్ప భూములిచ్చే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పారు. భూసేకరణ గ్రామసభ నిర్వహించరాదని వారు డిమాండ్ చేశారు.
నా ప్రాణాలు పోయిన తర్వాతే గ్రామసభ నిర్వహించాలి
కాళ్లాపూర్లో గ్రామసభ పెట్టొద్దు. పెట్టాలని కరాఖండిగా నిర్ణయిస్తే నాప్రాణాలు పోయిన తర్వాతే నిర్వహించాలి. గురువారం ఆమరణదీక్ష చేపట్టిన అనంతరం మాట్లాడుతూ.. తమ భూములను గుంజుకోవద్దని ఆందోళనలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరించి భూసేకరణకు సిద్ధమైంది. నిరుపేదల భూములు గుంజుకోవద్దని 78 రోజులపాటు దీక్షలు చేసినా ఫలితంలేదు. ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తమను టీజీఐఐసీ కార్యాలయానికి తీసుకెళ్లి అసైన్డ్ భూములే తీసుకుంటామని, పట్టా భూములు తీసుకోమని చెప్పి మోసం చేశారు. 12న గ్రామసభ నిర్వహణకు గ్రామంలో నోటీసు అతికించే యత్నం చేశారు. తామ ప్రాణాలైనా వదులు కానీ గ్రామసభ పెట్టనిచ్చేది లేదు. భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసేంత వరకు ఆందోళన విరమిం చే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి మా భూముల విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు. ఎమ్మెల్యే కాళ్లు వందసార్లు మొక్కినా ఫలితం లేకుండాపోయింది.
-పులిందర్, కాళ్లాపూర్ సర్పంచ్