కడ్తాల్ : రంగారెడ్డి జిల్లాలో భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మైసిగండి మైసమ్మతల్లి జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా కార్తీక మాసంలో అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అనావాయితీగా వస్తుంది. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మొదటి రోజు ఆలయ ప్రధాన అర్చకుల వేదమంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారికి క్షీరాభిషేకం, కుంభహారతి అనంతరం అమ్మవారిని విశేష అలంకరణలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని కొబ్బరి, మామిడాకుల తోరణాలు, వివిధ రకాల పూలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులకు సౌకర్యార్థం ఆలయ ఆవరణలో నిర్వాహకుల మౌలిక వసతులు కల్పించారు.
మొదటి రోజు ఆలయ వ్యవస్థాపకులు, నిర్వాహకులు అమ్మవారికి పాలాభిషేకం చేసి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారి అభిషేక కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనంద్, ఆలయ ట్రస్టీ శిరోలీపంతూనాయక్, ఆలయ ఈవో స్నేహలత, తాసిల్దార్ ఆర్పీ జ్యోతి, ఆలయ వ్యవస్థాపకులు చాట్ల వెంకటేశ్, జగదీశ్, టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్, నర్సింహ, భక్తులు పాల్గొన్నారు.