కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో గురువారం కేంద్ర గ్రామీణశాఖ నుంచి నేషనల్ లెవల్ మానిటారింగ్ బృందం సభ్యులు పర్యటించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులు, సమావేశాలకు సంబంధించిన తీర్మానాలు, పంచాయతీలో ఖర్చు చేస్తున్న నిధుల వివరాలను పరిశీలించారు. పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఉపాధిహామీ కూలీలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, పింఛన్దారులతో కలిసి ఆయా శాఖల అధికారులు సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఉపాధిహామీ పథకంలో ఏయే పనులు చేపట్టారు, ఎంత మేరకు కూలీలకు ఈ పథకం ఉపయోగపడు తుందనే అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధిహామీ బిల్లులు సకాలంలో రావడంలేదని, ఉపాధిహామీలో పని దినాలను, కూలీ డబ్బులను పెంచాలని, పని చేసే చోట వసతులు కల్పించాలని, దివ్యాంగులకు తగిన పనులు కల్పించాలని ఉపాధికూలీలు కేంద్ర బృందానికి వివరించారు.
మహిళా సంఘాల సభ్యులను బీమా సౌకర్యం కల్పించాలని, ఇండ్లు లేని మహిళాలకు ఇండ్లు నిర్మించాలని మహిళా సంఘం సభ్యులు అధికారులకు విన్నవించారు. మైసిగండి గ్రామంలో సెల్ సిగ్నల్స్ లేకపోవడంతో ఆసరా ఫించన్ల కోసం మండల కేంద్రానికి వెళ్లవలసి వస్తున్నదని, ఆసరా పింఛన్లు గ్రామంలో ఇచ్చే విధంగా చూడాలని అధికారులను మహిళలు కోరారు. అనంతరం గ్రామంలో ఐకేపీ ద్వారా బ్యాంక్ రుణాలతో లబ్ధిదారు లు ఏర్పాటు చేసుకున్న కిరాణషాప్, గిర్నీని పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్ఎల్ఏం సభ్యులు డాక్టర్ నెహ్రూ డాక్టర్ సౌందర్ పండియాన్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నీరజ, అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ జంగయ్య, డీపీఏం సూర్య, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో తేజ్సింగ్, ఏపీవో అంజయ్య, సర్పంచ్ తులసీరాం నాయక్, ఏపీఏం రాజేశ్వరి, పంచాయతీ కార్యదర్శి సత్యం పాల్గొన్నారు.