ఎనిమిదో విడుత హరితహారానికి రంగారెడ్డి జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. గతేడాదిలాగే ఈ సారి కూడా లక్ష్యానికి మించి మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా ఎన్ని మొక్కలు నాటాలో లక్ష్యాన్ని నిర్దేశించారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి హరితహారంలో భాగంగా జిల్లాలో మొత్తం కోటి మొక్కలను నాటాలని టార్గెట్గా పెట్టుకున్నారు. అందుకనుగుణంగా ఇప్పటికే జిల్లా అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. ఒక్కో గ్రామ పంచాయతీలో 10వేలకు తగ్గకుండా మొక్కలు నాటేందుకు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నారు.
ప్రధానంగా పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కలను ప్రాధాన్యమివ్వనున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా హరితహారంలో అన్ని శాఖలను భాగస్వాములను చేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు ఆయా శాఖలకు లక్ష్యాన్ని నిర్దేశించనున్నది. అదేవిధంగా నాటిన ప్రతి మొక్కనూ బతికించేలా పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తున్నది. గుంతలు తీసే ప్రక్రియ నుంచి మొక్కలు నాటే ప్రక్రియ వరకు ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేయనున్నారు. అటవీ ప్రాంతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మీటర్కు ఒక మొక్క చొప్పున నాటి దట్టమైన అడవులను పెంపొందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరోవైపు హరితహారం కార్యక్రమానికి నిధుల కొరత సమస్య ఉత్పన్నం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితనిధి కార్యక్రమంలో భాగంగా నిధులు సేకరించనున్నారు.
రంగారెడ్డి, మార్చి 4, (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. 2022-23 సంవత్సరానికి సంబంధించి ఎన్ని మొక్కలు నాటాలో అధికారులు టార్గెట్ను నిర్దేశించారు. వచ్చే హరితహారంలో భాగంగా మొత్తం జిల్లాలో కోటి మొక్కలను నాటడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. అందుకనుగుణంగా జిల్లా అటవీశాఖతోపాటు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. ఈ ఏడాది అవెన్యూ ప్లాంటేషన్(రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం)తోపాటు ప్రధానంగా పండ్లు, నీడనిచ్చే మొక్కలను నాటేందుకు ప్రాధాన్యమివ్వనున్నారు. అంతేకాకుండా జిల్లాలోని అటవీ ప్రాంతంలోనూ మొక్కలు నాటేందుకు జిల్లా అటవీ శాఖ యంత్రాంగం ప్లాన్ చేసింది. అయితే గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా హరితహారంలో అన్ని శాఖలను భాగస్వాములను చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా శాఖలకు నాటాల్సిన మొక్కల లక్ష్యాలను అటవీ శాఖ అధికారులు సిద్ధం చేశారు. అదేవిధంగా మొక్కలను నాటి విస్మరించడం కాకుండా ప్రతి మొక్కనూ బతికించేలా ఏర్పాట్లు చేయనున్నది. గుంతలను తీసే ప్రక్రియ నుంచి మొక్కలు నాటే ప్రక్రియ వరకూ ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేయనున్నారు. హరితహారం కార్యక్రమానికి నిధుల కొరత సమస్య ఉత్పన్నం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హరితనిధి కార్యక్రమం ద్వారా నిధులను సేకరించనున్నారు. పర్యావరణాన్ని పెంచడంతోపాటు రాష్ర్టాన్ని ఆకు పచ్చని తెలంగాణగా మార్చేందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
జిల్లాలో హరితహారం, పల్లె ప్రకృతివనాలు, మండలానికి ఒక బృహత్వనం తదితర కార్యక్రమాలతో జిల్లా పచ్చదనంతో కళకళలాడుతున్నది. 2015లో టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో జిల్లాలో పచ్చదనం పెంపొందడంతోపాటు అటవీ విస్తీర్ణం కూడా 5 శాతం మేర పెరిగింది. అయితే జిల్లాలో ఏడేండ్లుగా తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా 2015-16లో 73.78 లక్షల మొక్కలు, 2016-17 సంవత్సరంలో 1.39 కోట్ల మొక్కలు, 2017-18 సంవత్సరంలో 71.04 లక్షలు, 2018-19 సంవత్సరంలో 86.12 లక్షల మొక్కలు, 2019-20 సంవత్సరంలో 1.02 కోట్ల మొక్కలు, 2021-22 సంవత్సరంలో 89 లక్షల మొక్కలను నాటారు. అయితే ఈసారి కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ప్రధానంగా పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అందులో టేకు, ఉసిరి, జామ, నిమ్మ, సీతాఫల్, దానిమ్మ, బొప్పాయ, మునగ, గులాబీ, మందారం, మల్లె, కానుగ, నెమలినార, శ్రీగంధం తదితర మొక్కలను నాటనున్నారు. అదేవిధంగా జిల్లాలోని ప్రతి గ్రామంలో ఒక నర్సరీని ఏర్పాటు చేసిన దృష్ట్యా జిల్లావ్యాప్తంగా 560 నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన హరితనిధితో జిల్లాలో మరింత పచ్చదనం పెంపొందనున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, కాంట్రాక్టర్ల నుంచి హరితనిధి ఫండ్ను సేకరించనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి ప్రతినెలా రూ.500, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల నుంచి రూ.100, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ మేయర్ల నుంచి రూ.100, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రూ.25, మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీపీ, జడ్పీటీసీల నుంచి రూ.50, మున్సిపల్ కౌన్సిలర్ల నుంచి హరితనిధిని సేకరించనున్నారు. అదేవిధంగా అన్ని రకాల కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపుల నుంచి 0.1 శాతం, వ్యాపార, వాణిజ్య లైసెన్స్ రెన్యువల్ నుంచి రూ.1000, భూక్రయ, విక్రయాలు, ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో రిజిస్ట్రేషన్కు రూ.50 చొప్పున హరితనిధి కింద జమచేయనున్నారు. అదేవిధంగా విద్యార్థుల్లోనూ హరితహారంపై అవగాహన పెంచేందుకుగాను మొక్కల సంరక్షణలో వారి పాత్ర ఉందనే భావన కలిగించేందుకుగాను ప్రవేశాలు పొందే సమయంలో డిగ్రీ విద్యార్థుల అడ్మిషన్ల సమయంలో రూ.25, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు రూ.15, ప్రతి స్కూల్ అడ్మిషన్లకు రూ.10, వృత్తివిద్యా కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించి రూ.100ను హరితనిధి కింద ప్రత్యేకంగా జమ చేయనున్నారు.
జిల్లాలో అటవీ ప్రాంత విస్తరణపై జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పర్యావరణ పరిరక్షణకుగాను అటవీ ప్రాంత విస్తీర్ణాన్ని పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో తెలంగాణకు హరితహారంలో భాగంగా అటవీ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ప్రతి ఏడాది ఎంతో కొంతమేర అటవీ ప్రాంతంలో మొక్కలు నాటుతున్న అటవీ శాఖ యంత్రాంగం జనవరి నుంచి అధిక మొత్తంలో అటవీ ప్రాంతంలో మొక్కలను నాటే ప్రక్రియ ప్రారంభించింది. ముఖ్యంగా వచ్చే రెండేండ్లలో జిల్లాలోని అటవీ ప్రాంతాలను దట్టమైన అడవులుగా మార్చడమే లక్ష్యంగా జిల్లా అటవీ శాఖ ముందుకెళ్తున్నది. జిల్లాలో అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న ప్రాంతంలో విరివిగా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా హరితవనాలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మీటరుకు ఒక మొక్క చొప్పున నాటాలని నిర్ణయించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే రెండేండ్లలో జిల్లాలోని అటవీ ప్రాంతమంతా దట్టంగా మార్చేలా మొక్కలు నాటనున్నారు. జిల్లాలోని ఆమనగల్లు, శంషాబాద్ డివిజన్లలోని 83 బ్లాకుల్లో ఇప్పటికే ఖాళీ ప్రాంతాలను గుర్తించిన జిల్లా అటవీ శాఖ అధికారులు సంబంధిత ఖాళీ ప్రదేశాల్లో 3 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికను రూపొందించారు. అటవీ ప్రాంతాల్లో నెమలినార, నారవేపి, బూరుగ, కానుగ, రావి, అల్లనేరేడు, మర్రి, చింత, జువ్వి, ఇప్పా, నారవేప, ఎర్రచందనం, శ్రీగంధం, వేప, ఏరుమద్ది, నల్లమద్ది, టేకు, చిందుగ, సీతాఫల్, ఉసిరి, మారేడు, జిల్లెడు తదితర ఔషధ మొక్కలను నాటనున్నారు.