వాహనదారులకు కేంద్రం మూడోసారి వాత పెట్టింది. మళ్లీ ఇంధన ధరలు పెంచి సామాన్యులకు పరీక్ష పెట్టింది. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులతో నగరంలో ఇంధన కొరత వెంటాడుతున్నది. కొన్ని ప్రాంతాల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇంధనం కోసం వాహనదారులు గంటల తరబడి ఎదురుచూస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పెట్రో, డీజిల్ ధరలు మూడోసారి పెంచింది. తాజాగా లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు, సీఎన్జీ కేజీపై 1 రూపాయి పెంచింది. దీంతో నగరంలో లీటర్ పెట్రోల్ రూ.112.84 అయింది. డీజిల్ లీటర్ రూ.100.94 చేరింది. సీఎన్జీ కిలో రూ.97కు చేరింది. ఈ పెరిగిన ధరలు శనివారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. ఇటీవల రెండు సార్లు ఇంధన ధరలు పెంచిన విషయం తెలిసిందే.
సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): దేశంలో ప్రధాన నగరాల్లో అత్యధికంగా ఇంధన ధరలు హైదరాబాద్లోనే ఉండటం గమనార్హం. ఈనెల 15న పెట్రోల్పై రూ.3.42, డీజిల్పై రూ.3.26 పెంచింది. ఈనెల 19న పెట్రోల్, డీజిల్పై రూ.90 పైసలు పెంచిన విషయం తెలిసిందే. తాజా ఇంధన ధరల పెంపు అదనంగా భారం కానున్నది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ వ్యాపారంలో ఐదో వంతు వాటా కలిగిన అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూతపడింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా ముడిచమురు ధరలు భారీగా పెరిగాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
హనదారుల ఆగ్రహం
ఇష్టానుసారంగా ఇంధన ధరలు పెంచడం సరైనది కాదని వాహన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎటొచ్చి సామాన్యులకే ఇబ్బందులని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం ఇంధన ధరలు తగ్గించి అండగా నిలవాలని కోరారు. పెరిగిన ధరల కారణంగా ప్రయాణ ఛార్జీలు పెంచాల్సి వస్తుందని, అది సామాన్యులపై భారం మోపడమవుతుందని అన్నారు. ఇంధన ధరలు తగ్గించేల కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.