మిగ్జాం తుఫాన్ ప్రభావం రంగారెడ్డి జిల్లాపై పడింది. అసలే చలికాలం.. దీనికితోడు రెండు రోజులుగా ముసురు కురుస్తున్నది. చేతికొచ్చిన వరి పంట పొలాలు, కల్లాల్లో ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటు చలిగాలులు వీస్తుండడంతో జిల్లావాసులు గజగజ వణికిపోతున్నారు. నేడు, రేపు వర్ష ప్రభావం తీవ్ర రూపం దాల్చనుండడంతో ధాన్యం తడిసిపోతుందని రైతులు భయపడుతున్నారు. కవర్లు, టార్పాలిన్లతో ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
– రంగారెడ్డి, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, నవంబరు 5(నమస్తే తెలంగాణ): ‘మిగ్ జాం తుఫాన్ ప్రభావం రంగారెడ్డి జిల్లాపై పడింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులు, చిరు జల్లులతో వర్షాలు కురుస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యానికి పొంచి ఉన్న తుఫాన్ ముప్పుతో రైతులు కలవరపడుతున్నారు. మరోవైపు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలి తీవ్రత కారణంగా ప్రజానీకం గజగజ వణికిపోతున్నది. ఓ వైపు ముసురు వర్షం.. మరోవైపు చలి గాలులు జిల్లా ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
అన్నదాతల్లో గుబులు ..
మిగ్ జాం తుఫాన్ జిల్లా ప్రజలను భయపెడుతున్నది. తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా ముసురు వీడడం లేదు. జిల్లాలో కోతలు కొనసాగుతుండగా..చాలా వరకు ధాన్యం పొలాలు, కల్లాల్లోనే ఉన్నది. కొంత ధాన్యాన్ని రైతులు ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు తరలించారు. నేడు, రేపు వర్ష ప్రభావం తీవ్ర రూపం దాల్చనుండడంతో ధాన్యం తడిసిపోతుందని రైతులు భయపడుతున్నారు. కవర్లు, టార్పాలిన్లతో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
చలితో ఇబ్బందులు పడుతున్న జనం
జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. అన్ని మండలాల్లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓ వైపు ముసురు వర్షం.. మరోవైపు చలితో రోజంతా జిల్లా ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఉదయం పొగమంచు కమ్మేస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పనులకు వెళ్లేవారు నానా అవస్థలు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశం ఉండడంతో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.