ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను వాన వదలడం లేదు. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుం డా కురుస్తున్న ముసురుతో రెండు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. ప్రజలు ఇండ్ల నుంచి బయటికి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి తోడు ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుతుండడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అక్కడక్కడా పంట పొలాలు నీట మునిగాయి. పట్టణాలు, పల్లెల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వికారాబాద్ జిల్లాలోని కాగ్నా, మూసీ నదులు పొంగిపొర్లుతున్నాయి. ధారూరు మండలంలోని దోర్నాల్, తాండూరు మండలంలోని బెల్కటూరు, గాజీపూర్ వాగులు పొంగిపొర్లడంతో ధారూరు-దోర్నాల్, పెద్దేముల్-తాండూరు తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా పలు చెరువులు మత్తడి దుంకుతుండగా..జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కురిసిన వానతో వికారాబాద్ మండలంలోని మదన్పల్లిలో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం 7.7 సెంటీమీటర్లు నమోదైంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీలోని ఓ వెంచర్లోని బ్రిడ్జి వరద నీటికి కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. చేవెళ్ల మండలంలోని తంగడిపల్లిలో ఓ ఇల్లు వర్షానికి పాక్షికంగా దెబ్బతిన్నది. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతేనే బయటికి రావాలని జిల్లాల ఉన్నతాధికారులు ప్రజలకు సూచించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. మరోవైపు 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా వికారాబాద్ కలెక్టరేట్లో కంట్రోల్ రూంతోపాటు ప్రజలు అత్యవసర సమయంలో సహాయం పొందేందుకు 7995061192 టోల్ ఫ్రీ నంబర్నూ ఏర్పాటు చేశారు. కాగా వర్షాల నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
రంగారెడ్డి, జూలై 20 (నమస్తే తెలంగాణ) : మూడు రోజులుగా రంగారెడ్డి జిల్లాలో ముసురువాన కురుస్తున్నది. దీంతో చెరువులు, కుంటల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతున్నది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మూసీ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. అక్కడక్కడా పంట పొలాలు నీట మునిగాయి. పట్టణాలు, పల్లెల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జనం ఇండ్లకే పరిమితమయ్యారు. గురువారం జిల్లా వ్యాప్తంగా సరాసరి 3.28 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. చేవెళ్లలో అత్యధికంగా 6.73సెం.మీ.ల వర్షం కురిసింది. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో మూసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పాత నిర్మాణాలను పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్తగా గురు, శుక్ర వారాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. వర్షాధారంగా సాగు చేసిన పత్తి, కందులు, ఆముదం, జొన్న వంటి పంటలకు ఈ వర్షాలు అనుకూలంగా ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో వర్షపాతం వివరాలు..
జూలై నెలలో సాధారణ వర్షపాతం 14.66సెం.మీ.లు కాగా ఇప్పటివరకు 10.47సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. గురువారం జిల్లా సగటున 3.28 సెం.మీ.ల వర్షపాతం కురిసింది. జిల్లాలోని వివిధ మండలాల్లో నమోదైన వివరాలను పరిశీలిస్తే.. చేవెళ్లలో 67.3 సెం.మీటర్లు, నందిగామలో 62.8, షాబాద్లో 58.7, చౌదరిగూడెంలో 58.5, శంకర్పల్లిలో 52.9, మహేశ్వరంలో 5.0, ఫరూఖ్నగర్లో 4.34, మొయినాబాద్లో 4.33, కేశంపేటలో 4.1, కందుకూరు 4.06, గండిపేట 3.93, శేరిలింగంపల్లి 3.8, యాచారం 3.73, కొందుర్గులో 3.6, సరూర్నగర్లో 2.44, ఆమనగల్లు 2.4, రాజేంద్రనగర్, తలకొండపల్లి 2.34, బాలాపూర్ 2.05, మాడ్గుల 1.82, హయత్నగర్ 1.74, కడ్తాల్ 1.44, అబ్దుల్లాపూర్మెట్ 1.35, ఇబ్రహీంపట్నం 1.21, కొత్తూరు 1.18, శంషాబాద్ 0.9, మంచాలలో 0.4సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.
వికారాబాద్ జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధానమైన కాగ్నా నదితోపాటు మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ధారూరు మండలం దోర్నాల్, పరిగి సమీపంలో, కోట్పల్లి, తాండూరు మండలం బెల్కటూర్ వాగు, గాజీపూర్ వాగు పొంగిపొర్లుతుండడంతో ధారూరు-దోర్నాల్, పెద్దేముల్-తాండూరు తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ధారూరులో శిథిలావస్థకు చేరిన ఇంటి గోడ కూలగా, ఎలాంటి నష్టం జరుగలేదు. పలు చెరువులు నిండి అలుగుపారుతుండడం గమనార్హం. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే తప్ప బయటకు రావద్దని ప్రజలకు జిల్లా ఉన్నతాధికారులు సూచించారు. ఎక్కడ కూడా ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ ఆదేశించారు. మరోవైపు 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయడంతోపాటు ప్రజలు అత్యవసర సమయంలో సహాయం కోసం 7995061192 టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలోనే జిల్లాలో అత్యధిక వర్షపాతం
గురువారం ఉదయం నుంచి సాయంత్రం కురిసిన భారీ వర్షంతో జిల్లాలోని వికారాబాద్ మండలం మదన్పల్లిలో అత్యధికంగా 7.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. వికారాబాద్లో 5.3, వికారాబాద్ మండలం మద్గుల్ చిట్టంపల్లిలో 6.6, కులకచర్ల మండలంలోని ముజాహిద్పూర్లో 5.5, తాండూరులో 5.3, బషీరాబాద్లో 5.2 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది.
వికారాబాద్ కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు
జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 24 గంటలపాటు ప్రజలకు సహాయం అందజేసేందుకు కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా జిల్లా ఉన్నతాధికారులు ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లావ్యాప్తంగా శిథిలావస్థకు చేరిన ఇండ్లను గుర్తించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్తు శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. వాగుల్లో ప్రమాదవశాత్తు చిక్కుకోకుండా 24 గంటలపాటు వీఆర్ఏతోపాటు పోలీస్ కానిస్టేబుళ్లను వాగుల వద్ద పహారా ఉండేలా జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు.
అప్రమత్తంగా ఉండండి
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి తక్షణ చర్యలు తీసుకోవాలి. తాగునీరు కలుషితం కాకుండా, లీకేజీలు లేకుండా మిషన్ భగీరథ అధికారులు చర్యలు చేపట్టాలి. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ అధికారులు రోడ్లు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలి. మరోవైపు ప్రమాదకరంగా ఉన్న తరగతి గదుల్లో విద్యార్థులను కూర్చోనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సమస్యలు తలెత్తితే తక్షణ సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలి.
– నారాయణరెడ్డి, కలెక్టర్ వికారాబాద్