పరిగి, జనవరి 5 : పరిగి పట్టణ శివారులోని న్యామత్నగర్ పరిధిలో నేటి నుంచి ఇస్తేమా ప్రారంభమై ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగనున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తోపాటు కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్ తదితర ప్రాంతాల నుంచి ముస్లింలు పాల్గొననుండగా, కొందరు శుక్రవారం చేరుకున్నారు. ఇస్తేమా నిర్వహణకు ప్రభుత్వం రూ.2.45 కోట్లు మంజూరు చేసింది. నీటి వసతి కోసం కాళ్లాపూర్ నుంచి ప్రత్యేకంగా పైప్లైన్ వేయించి మిషన్ భగీరథ నీటిని సంపులోకి వదులుతున్నారు.
ఇతర అవసరాల కోసం ప్రత్యేకంగా పైప్లైన్లు ఏర్పాటు చేయించారు. భోజన వసతి కోసం 26 వంటశాలలతో పాటు 6 వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించారు. ఎస్పీ కోటిరెడ్డి పర్యవేక్షణలో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 30 మంది ఎస్ఐలతోపాటు మొత్తం 500 మందితో పోలీసు బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఇతర ఏర్పాట్లను కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. నాలుగుచోట్ల వాహనాల పార్కింగ్కు స్థలాన్ని ఏర్పాటు చేశారు.