ఇబ్రహీంపట్నం, జూన్ 6 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోని సాగు భూములన్నింటినీ సస్యశ్యామలం చేయటంతోపాటు ప్రజలకు సాగు, తాగు నీరు అందించాలనే సంకల్పంతో అనేక కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాకు పూర్తిస్థాయిలో సాగు, తాగు నీటిని అందించేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా జిల్లాలోని 2,08, 000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేశారు. ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, కల్వకుర్తి, మహేశ్వరం, షాద్నగర్ నియోజకవర్గాలతోపాటు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ మండలానికి సాగునీరు అందించనున్నారు. ఉద్దండపూర్ వద్ద నిర్మిస్తున్న 17 టీఎంసీల రిజర్వాయర్ నుంచి సుమారు 105 కిలోమీటర్ల దూరం వరకు కాలువలను నిర్మించి వాటి ద్వారా జిల్లాలోని సుమారు 600 చెరువులకు తాగు,సాగు నీరందించనున్నారు. ఇందుకోసం రిజర్వాయర్ల నిర్మాణంతోపాటు కాలువల నిర్మాణ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఆగస్టు నెలాఖరు వరకు కాలువల ద్వారా నీటిని అందించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తిచేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నూతనంగా నిర్మించిన సచివాలయంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపైనే మొదటి సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
శివన్నగూడ రిజర్వాయర్ నుంచి..
డిండి ద్వారా శివన్నగూడ రిజర్వాయర్కు సరఫరా చేస్తున్న నీటి నుంచి ఎత్తిపోతల ద్వారా రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని సుమా రు 30 వేల ఎకరాలకు సాగు నీరు అందించే పనులకూ శ్రీకారం చుట్టా రు. ఆ నీటితో 120 చెరువులను నింపాలని నిర్ణయించారు. ఈ పనులకు సంబంధించిన డీపీఆర్నూ ప్రభుత్వం ఇప్పటికే సిద్ధ్దం చేసిం ది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని 54 వేల ఎకరాలకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా సాగునీరు రా నుండగా.. 30 వేల ఎకరాలకు శివన్నగూడ రిజర్వాయర్ నుంచి రానున్నాయి. దీంతో ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లో 84 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది.
అడ్డంకులను అధిగమించి..
పాలమూరు-రంగారెడ్డి ద్వారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తుండగా కాంగ్రెస్, బీజేపీలతోపాటు సీమాంధ్రకు చెందిన కొంతమంది కోర్టుల్లో కేసులు వేసి అనేక అడ్డంకులు సృష్టించారు. గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు, సీడబ్ల్యూసీలో పలు కేసులు వేశారు. వీటన్నింటినీ సీఎం కేసీఆర్ న్యాయబద్ధంగా ఎదుర్కొని పనుల ప్రారంభానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన నిధులను కూడా విడుదల చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 4,19,459 ఎకరాలకు సాగునీరు అందనుండగా.. జిల్లాలోని చెరువులు నీటితో నిండనున్నాయి. దీంతో తమకు పుట్టగతులుండవని, ప్రతిపక్ష నాయకులు కేసులు వేసి అనేక అవరోధాలను సృష్టించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
రంగారెడ్డి సస్యశ్యామలం అవుతుంది
పాలమూరు-రంగారెడ్డి పూర్తైతే జిల్లాలో సాగు, తాగు నీరు సమస్య పూర్తి స్థాయిలో తీరనున్నది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో సరైన సాగు, తాగునీరు లేక జిల్లావాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షా లు సరిగ్గా కురియక ఈ ప్రాంతం కరువు కాటకాలతో విలయతాండవం చేసింది. పాలమూరు-రంగారెడ్డి పూర్తైతే ఉమ్మడి రం గారెడ్డి జిల్లాలో 4,19,459 ఎకరాలకు సాగునీరు అందనుండగా.. జిల్లాలోని అనేక చెరువులు నీటితో నిండనున్నాయి.
-మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం