వికారాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : పోడు పట్టాల సంతోషంలో ఉన్న గిరిజనులకు సర్కారు మరో వరాన్ని ఇచ్చింది. హక్కుదారులకు రైతుబంధు పెట్టుబడి సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. నేటి నుంచి జిల్లాలోని 436 మంది రైతులకు సం బంధించిన 552 ఎకరాల పోడు భూములకు ఎకరానికి రూ. ఐదు వేల చొప్పున పెట్టుబడి సాయం జమ కానున్నది. ఇప్పటికే పోడు రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను వ్యవసాయాధికారులు సేకరించి ఆన్లైన్లో పొందుపర్చారు. రైతుబం ధు డబ్బులు ఖాతాల్లో జమ కానుండటంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు తమను ఎప్పుడూ పట్టించుకో లేదని.. సమ స్యలను పరిష్కరించలేదని.. కానీ, సీఎం కేసీఆర్ మాకు అండగా నిలిచి దశాబ్దాల కలను సాకారం చేయడంతో ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కాగా జిల్లాలోని కులకచర్ల మం డలంలోని రైతులకు పెట్టుబడి సాయం అధికంగా అందనున్నది. ఇక్కడ 187 మంది రైతులకు సంబంధించి 216 ఎకరాల భూములున్నాయి.
గిరిజనుల ఎన్నో ఏండ్ల కలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేశారు. ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములపై గిరిజనులకు ప్రభుత్వం సంపూర్ణ హక్కులను కల్పించింది. 2005కు ముందు అటవీ భూములను ఆక్రమించి సాగు చేసుకుంటున్న గిరిజనులకు ప్రభుత్వం పోడు పట్టాలను అందజేసింది. అర్హులైన గిరిజనులకు పోడు భూముల పట్టాలను అందజేయడంతోపాటు సాగు చేసేందుకు పెట్టుబడి సాయాన్ని కూడా ప్రభుత్వం అందించనుంది. పోడు భూముల రైతులకు కూడా రైతు బంధు అందిస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడి సహాయాన్ని అందజేసేందుకు జిల్లాలోని పోడు రైతుల ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలను జిల్లా వ్యవసాయాధికారులు ఇప్పటికే సేకరించి రైతు బంధు పోర్టల్లో పొందుపర్చారు. నేటి నుంచి వారికి ఏడాదికి ఎకరాకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని నేరుగా పోడు భూముల రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. పోడు భూముల హక్కుల కోసం ఎన్నో ఏండ్లుగా గిరిజనులు పోరాటం చేసినా.. గతంలోని ఏ ఒక్క ప్రభుత్వమూ పట్టించుకోలేదు. ప్రతి ఏటా భూముల సాగు సమయంలో పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు-అటవీ శాఖ సిబ్బందికి మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉండేది. కొన్ని సందర్భాల్లో పోడు భూముల్లో విత్తనాలు నాటిన అనంతరం కూడా అటవీ శాఖ సిబ్బంది సంబంధిత పంట పొలాలను దున్నేసిన పరిస్థితులున్నాయి. పోడుదారుల గోడును గుర్తించిన సీఎం కేసీఆర్ అర్హులైన వారందరికీ పట్టాలను అందజేశారు.
పోడు రైతులు సరైన బ్యాంకు ఖాతా వివరాలివ్వాలి; జిల్లా వ్యవసాయాధికారి గోపాల్
ప్రభుత్వ ఆదేశాల మేరకు పోడు భూముల పట్టాలు పొందిన రైతుల బ్యాంకు, ఆధార్ కార్డు వివరాలను రైతు బంధు పోర్టల్లో పొందుపర్చాం. ఇప్పటికే ఒకరిద్దరు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రైతు బంధు జమ కాగా, నేటి నుంచి పూర్తి స్థాయిలో పోడు పట్టాలు పొందిన గిరిజనుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కానుంది. ఇంకా ఎవరైనా పోడు పట్టాలు పొందిన రైతులు ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలను అందజేయనట్లయితే వెంటనే ఆయా మండల వ్యవసాయాధికారులకు అందజేయాలి.
పోడు రైతులను ఆదుకున్న ఏకైక సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాలను అందించడం చాలా సంతోషంగా ఉంది. గత పాలకులు ఎవ్వరు కూడా పోడు భూములను సాగు చేస్తున్న రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రస్తుతం నాకు ప్రభుత్వం 4 ఎకరాల పోడు భూముల పట్టా అందించింది.
– ధానావత్ఢాకూనాయక్, పాషాపూర్, పెద్దేముల్
సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం
తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ పోడు రైతుల భూములను పూర్తిస్థాయిలో అధికారులతో సర్వే చేయించి అర్హులైన మాలాంటి నిరుపేదలకు పోడు పట్టాలను అందించారు. రైతు బంధు పథకాన్ని కూడా పోడు భూములకు అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. పోడు రైతులను పట్టించుకున్నందుకు సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– రాథోడ్ తుకారాం, పాషాపూర్, పెద్దేముల్ మండలం
పోడు భూముల రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్
పోడు భూములున్న రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ ఆదుకునేందుకు పట్టాలు అందించారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా పోడు భూములున్న రైతులకు న్యాయం చేయలేదు. ఏండ్ల తరబడి భూమిని సాగుచేసుకుంటున్నవారికి సరైన హక్కులు లభించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో రైతులకు కావాల్సిన అన్ని సమస్యలను పరిష్కరించిన సీఎం పోడుభూముల సమస్యలను పరిష్కరించారు. దీనికి రైతులందరం సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– బుడ్డమ్మ, మక్తవెంకటాపూర్, కులకచర్ల మండలం
పోడు రైతులకు పండుగే..
పోడు భూములకు సంబంధించి సీఎం కేసీఆర్ యుద్ధప్రాతిపదికన సర్వే చేయించి అర్హులైన రైతులను ఎంపిక చేశారు. పోడు రైతులకు పట్టాలు ఇవ్వడంతోపాటు రైతు బంధు ఇస్తానని తెలుపడంతో రైతులు ఆనందపడుతున్నారు. ఇక పోడు రైతులకు పండుగే..
– మఠం రాజశేఖర్, మందిపల్, కులకచర్ల మండలం
ఆదుకోవడం అభినందనీయం
ఎన్నో ఏండ్ల నుంచి పోడు భూములను సాగు చేస్తున్న రైతులకు పట్టాలివ్వాలని ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు పట్టించుకోలేదు. పోడు రైతులకు పట్టాలు అందించడంతో పాటు వారు రైతు బంధుకు కూడా అర్హులని సర్కారు ప్రకటించడం అభినందనీయం.
– శాంతితులసీరాం, పటేల్చెరువుతండా సర్పంచ్