వికారాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచుతున్నది. బీఆర్ఎస్ హయాంలో పదేండ్లపాటు ప్రతి సీజన్కు ముందే రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని అందించి అప్పుల్లో కూరుకుపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకుంటే.. మోసపూరిత హామీలిచ్చి పవర్లోకి వచ్చిన రేవంత్ సర్కార్ యాసంగికి సంబంధించిన రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని ఇప్పటివరకు నాలుగు ఎకరాల్లోపు రైతులకే అందించి మిగిలిన వారికి మొండిచెయ్యి చూపుతున్నది. దీంతో మిగిలిన అర్హులైన రైతులు తమకు పెట్టుబడి సాయం ఎప్పుడంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు రైతులకు పెట్టుబడి సాయాన్ని రూ.15,000 చెల్లిస్తామని ఆర్భాటంగా ప్రకటించి.. దానిని రూ.12,000లకు తగ్గించింది. అదేవిధంగా రైతు భరోసాను అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో ఒకేసారి జమ చేస్తామని చెప్పి మాట తప్పింది.
విడతలవారీగా.. అది కూడా మొదట మండలానికి ఒక గ్రామాన్ని చొప్పున ఎంపికచేసి.. పెట్టుబడి సాయాన్ని అందించింది. తదనంతరం ఒక్క ఎకరం, రెండెకరాలు.. ఇప్పటివరకు కేవలం నాలుగు ఎకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే పెట్టుబడి సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. మిగిలినవారికి ఎప్పుడు పంపిణీ చేస్తుందో స్పష్టంగా చెప్పకపోవడంతో పెట్టుబడి సాయం జమయినట్లు ఏమైనా మెసేజ్ వచ్చిందా అని చాలామంది తమ ఫోన్లను చెక్ చేసుకుంటున్నారు. కాగా, జిల్లాలో అధికారులు అర్హులుగా గుర్తించిన రైతుల్లో ఇంకా 86,872 మందికి పెట్టుబడి సాయం అందాల్సి ఉండగా.. వారు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
మరోవైపు వానకాలం కూడా సమీపిస్తున్నప్పటికీ ఇంకా యాసంగి రైతు భరోసా సాయం అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా, జిల్లాలో 3,12,872 మందిని అధికారులు అర్హులుగా గుర్తించి రూ.385.46 కోట్ల రైతు భరోసా సాయాన్ని అందించాలని నిర్ణయించగా, ఇప్పటివరకు నాలుగు ఎకరాల్లోపు గల 2,26,000 మంది రైతులకు రూ. 212.52 కోట్ల సాయాన్ని మాత్రమే వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. మిగిలినవారికి పెట్టుబడి సాయం ఎప్పుడు జమవుతుందనేది అధికారులకు కూడా స్పష్టత లేదు. దీంతో కాంగ్రెస్ పాలనపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి రాగానే రైతు భరోసా సాయాన్ని పెంచుతామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు అర్హులందరికీ పంపిణీ చేయకుండా తాత్సారం చేయ డంపై జిల్లా అంతటా అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. అయితే ప్రతి సీజన్కు ముందే విత్తనాలు, ఎరువులను కొనేందుకు పెట్టుబడి సాయాన్ని ఠంచన్గా, సకాలంలో అందించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను ఊరూరా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
బీఆర్ఎస్ హయాంలో గుంట భూమి మొదలుకొని అర్హులందరికీ రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందింది. కేసీఆర్ హయంలో ప్రతి సీజన్లో 6.20 లక్షల ఎకరాల వరకు రైతుబంధు సాయాన్ని అందించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా కింద పెట్టుబడి సాయాన్ని 5.80 లక్షల ఎకరాలకు కుదించింది. 2018 వానకాలంలో 1,94,833 మందికి రూ.221 కోట్లు, యాసంగిలో 1,75,989 మందికి రూ.206, 2019 వానకాలంలో 1,78,998 మంది కి రూ.255, యాసంగిలో 1,71,824 మందికి రూ.194, 2020 వానకాలంలో 2,113,341 మందికి రూ.297, యాసంగిలో 2,19,264 మందికి రూ. 301, 2021 వానకాలంలో 2,25,438 మందికి రూ.300, యాసంగిలో 2,24,928 మందికి రూ.241, 2022-23 వానకాలంలో 2,47,707 మందికి రూ.305, యాసంగిలో 2,43,447 మందికి రూ.299, 2023-24 వానకాలంలో 2,62,065 మంది రైతులకు రూ.307.47 కోట్ల పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.5 వేల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో కేసీఆర్ ప్రభుత్వం జమ చేసింది.