న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ : వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పోకడలను రైతులు అనుకరిస్తున్నారు. సులభ పద్ధతిలో వ్యవసాయ చేయడం, తక్కువ ఖర్చు, శ్రమతో ఎక్కువ దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు చేసుకునేందుకు సూక్ష్మ, తుంపర సేద్యం ఎంతో దోహదపడుతుంది. సాగునీటి ఎద్దడి ఉండే మెట్ట ప్రాంతాల్లో తుంపర సేద్యం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో తుంపర సేద్యం ద్వారా రైతులు అధిక లాభాలను అర్జించే అవకాశం ఉంది.
రైతులను తుంపర సేద్యం వైపు మళ్లించేందుకు ప్రభుత్వం కూడా సబ్సిడీలు ఇచ్చి అందుకు సంబంధించిన పరికరాలను అందిస్తోంది. ఆరుతడి పంటలైన వేరుశనగ, శనగ, మొక్కజొన్న, బబ్బెర, కందులు, పెసర, పత్తి, పలు కూరగాయలు, ఆకుకూర పంటలను తుంపర సేద్యం ద్వారా విరివిగా పండించవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. తుంపర సేద్యం డ్రిప్, స్ప్రింక్లర్ల వాడకం ముఖ్యమైనవిగా చెప్పొ చ్చు. డ్రిప్ విధానంలో పంటలోని ప్రతి సాలుకు సన్నని పైపు అమర్చి ఒక్కో చుక్క నీరు మొక్క మొదలులో పడేలా చేయడం, స్ప్రింక్లర్ల విధానంలో పంటలో పెద్ద పైపులు వేసి స్ప్రింక్లర్ హెడ్ ద్వారా నీటిని విరజిమ్మి పంటకు నీరందించడం జరుగుతుంది.
స్ప్రింక్లర్లను మూడు విధాలుగా పంట పొలాల్లో అమర్చుకునే అవకాశం ఉంది. శాశ్వతంగా పైపులను భూమిలో పాతిపెట్టి స్ప్రింక్లర్ హెడ్లను అమర్చి నీటిని విరజిమ్మడం మొదటి విధానం అయితే కొన్ని పైపులను మాత్రం భూమి లోపల ఉంచి మిగతా పరికరాలను బయట ఉంచి మొక్కలన్నింటికీ తుంపర్లు పడేలా అమర్చుకోవడం రెండో విధానం. ఇక స్ప్రింక్లర్ పైపులన్నీ భూమిపైనే ఉంచి పంటకు నీరందించడం మూడో విధానంగా చెప్పొచ్చు. ఈ విధానం ద్వారా పైపులను ఒకచోట నుంచి మరో చోటికి తరలించి వీలైనన్నీ పంటలకు తుంపరసేద్యం ద్వారా నీరందించేందుకు వీలవుతుంది. స్ప్రింక్లర్లో ముఖ్యమైనది స్ప్రింక్లర్ హెడ్. ఇందులో రెండు రంధ్రాలు ఉంటాయి. ఒకటి 4 నుంచి 5.6మిల్లీమీటర్ల సైజు ఉండగా ఇంకోటి 3.13 మిల్లీమీటర్ల సైజు ఉంటుంది. ఎక్కువ పీడనం గల స్ప్రింక్లర్ సుమారు 35 మీటర్ల వ్యాసం కలిగిన భూమిని తడుపుతుంది. తక్కువ పీడనం గల స్ప్రింక్లర్ 30మీటర్ల వ్యాసం గల భూమిని మాత్రమే తడుపుతుంది.
తుంపర సేద్యంలో భాగంగా స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసుకునేందుకు రైతులకు ఖర్చు కూడా తక్కువే అని చెప్పొచ్చు. ఎకరం భూమిలో పంట సాగు కోసం స్ప్రింక్లర్ల పైపులు కొనుగోలు చేసేందుకు రూ.5వేల నుంచి రూ.5,600ల వరకు ఖర్చవుతుంది. రెండు ఎకరాలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు, మూడు ఎకరాలకు రూ.9వేల నుంచి రూ.10వేల వరకు, నాలుగు ఎకరాలకు రూ.11వేల నుంచి రూ.12వేల వరకు ఖర్చవుతుంది. పైపుల సైజులను బట్టి ఖర్చులోనూ తేడాలు ఉంటాయి. అయితే రైతులు కొనుగోలు చేసిన స్ప్రింక్లర్ పైపులు, హెడ్ వాల్వ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే ఎక్కువ రోజులు ఎలాంటి అవాంతరం లేకుండా పంటలను నీటిని అందించవచ్చు. స్ప్రింక్లర్లలో ఇంపాక్ట్ స్ప్రింక్లర్లు, మైక్రో స్ప్రింక్లర్స్, పార్ట్ సర్కిల్ స్ప్రింక్లర్స్, పర్ఫోరేటెడ్ పైపులు, జెట్ స్ప్రింక్లర్స్, పాపప్ స్ప్రింకర్స్, రెగ్యులేటెడ్ స్ప్రింక్లర్స్ తదితర రకాలు ఉంటాయి.