వికారాబాద్, ఫిబ్రవరి 23 : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం ఈ నెల 28 నుంచి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం 29 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి ఎన్.శంకర్ నాయక్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇంటర్ మొదటి సంవత్సరంలో జనరల్ విద్యార్థులు 6447 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1352 మంది ఉన్నారని తెలిపారు. ఇంటర్ ద్వితీయ జనరల్ విద్యార్థులు 7689, ఒకేషనల్ విద్యార్థులు 1335 మంది ఈ పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో మొత్తం 7799 మంది, ద్వితీయ సంవత్సరంలో జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో మొత్తం 9024 మంది హాజరు కానున్నారని వివరించారు.
జిల్లా వ్యాప్తంగా 29 థియరీ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పది పరీక్ష కేంద్రాలు, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ కళాశాలల్లో మూడు, మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలల్లో ఒకటి, మైనారిటీ వెల్ఫేర్ జూనియర్ కళాశాలల్లో ఒకటి, ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ కళాశాలల్లో 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు రాజమోహన్, బుచ్చయ్య, వివిధ కళాశాలల చీఫ్ సూపరింటెండెంట్స్, అధికారులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ మెంబర్స్, సిట్టింగ్ స్క్వాడ్ మెంబెర్స్, కస్టోడియన్స్ పాల్గొన్నారు.