రైతన్నల శ్రేయస్సు కోసం రాష్ట్ర సర్కార్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ సాగు మొదలు.. పంట చేతికొచ్చే వరకు పెద్ద దిక్కులా అండగా నిలుస్తున్నది. రైతుబంధు, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, పనిముట్లను అందజేస్తూ ఆసరా అవుతున్నది. అన్నదాత ఏ కారణం చేతనైనా మృతి చెందితే ఆ కుటుంబం ఇబ్బందులకు గురికావద్దన్న సదుద్దేశంతో రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. ఈ ఏడాది ఈ నెల 14 నుంచి కొత్త పాలసీని అమల్లోకి తెచ్చేందుకు కొత్తగా పట్టాపాసుపుస్తకాలు పొందినవారి నుంచి ఇప్పటి వరకు దరఖాస్తులు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లాలో 28,903 మందికి కొత్త పుస్తకాలు మంజూరుకాగా.. వీరిలో 9,898 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,53,592 మంది రైతులు పాలసీని రెన్యువల్ చేసుకున్నారు. జిల్లాలో మొత్తంగా 1,70,526 మందికి బీమా సౌకర్యం కలిగి ఉన్నారు. గడిచిన ఐదేండ్లలో వివిధ కారణాలతో మృతిచెందిన 4,413 మంది రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.200.20కోట్ల సాయం అందించి ఆదుకున్నది.
రంగారెడ్డి, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మరింత మంది రైతు కుటుంబాలకు ‘రైతు బీమా’తో భరోసా కల్పించే దిశగా చర్యలు తీసుకున్నది. కొత్తగా మరికొంతమందిని పథకంలో చేర్పించేందుకు ఆగస్టు 14 నుంచి కొత్త పాలసీని అమల్లోకి తెచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ఈ నెల 5 వరకు రంగారెడ్డి జిల్లాలోని అన్ని రైతు వేదికల వద్ద వ్యవసాయశాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా 1,53,592 మంది రైతులు పాలసీని రెన్యువల్ చేసుకోగా.. గతంలో పాసు పుస్తకాలు ఉండి దరఖాస్తు చేసుకోలేనివారు ఈసారి 7,036 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది కొత్తగా 28,903 మందికి కొత్త పుస్తకాలు మంజూరుకాగా.. వీరిలో 9,898 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో రైతు బీమాకు 1,70,526 మంది అర్హులుగా తేలారు. బీమా పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు వివిధ కారణాలతో మృతిచెందిన 4,413 మంది రైతు కుటుంబాలకు ప్రభుత్వం రూ.200.2 కోట్ల సాయం అందించి ఆదుకుంది.
గుంట భూమి ఉన్న రైతుకూ వర్తింపు
రైతు బీమాకు దరఖాస్తు చేసుకుంటున్న రైతుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నది. గుంట భూమి ఉండి పట్టా పాసుపుస్తకం పొంది ఉన్నా.. రైతుగా పరిగణించి ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నది. దీంతో చాలామంది ఎంతో కొంత భూమిని కొనుగోలు చేస్తున్నారు. అలాగే.. కుటుంబంలో ఒకరిద్దరి పేరుపై ఉన్న భూమిని మిగతా సభ్యులు తలా కొంత మార్చుకోవడంతో రైతుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఇప్పటికే బీమాలో చేరిన రైతులు రెన్యువల్ చేసుకోగా.. ఈ ఏడాది కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన వారు దరఖాస్తు చేసుకోవడంతో జిల్లావ్యాప్తంగా రైతు బీమా పథకానికి 1,70,526 మంది అర్హత పొందారు.
ఐదేండ్లలో రూ.200.2 కోట్ల సాయం
రైతు బీమా పథకం జిల్లాలో వేల మంది రైతు కుటుంబాలకు అండగా నిలిచింది. 2021-22లో 942 మంది రైతులకు, 2022-23లో 655 రైతు కుటుంబాలను రైతు బీమా కింద ప్ర భుత్వం ఆదుకుంది. గడచిన ఐదేండ్ల కాలంలో జిల్లా వ్యాప్తంగా 4,413 మంది రైతులు మరణించగా.. వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున రూ.200.2 కోట్ల బీమాను క్లెయిమ్ చేసింది. రైతు మరణించిన పది రోజుల్లోనే నామినీ ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులను జమ చేసి ఆదరువునిచ్చింది.
మండలాలవారీగా అర్హుల వివరాలు
మండలం : రైతుల సంఖ్య
షాబాద్ : 11,482
చేవెళ్ల : 10,499
మొయినాబాద్ : 5,694
శంకర్పల్లి : 7,956
మంచాల : 9,660
మాడ్గుల : 13,809
యాచారం : 7,715
ఇబ్రహీంపట్నం : 7,648
అబ్దుల్లాపూర్మెట్ : 3,993
హయత్నగర్ : 45
ఆమనగల్లు : 6,628
కడ్తాల్ : 6,764
కందుకూరు : 8,965
మహేశ్వరం : 6,119
బాలాపూర్ : 832
శంషాబాద్ : 5,057
గండిపేట్ : 538
రాజేంద్రనగర్ : 51
చౌదరిగూడెం : 6,912
నందిగామ : 4,679
కొత్తూరు : 4,479
కేశంపేట : 10,682
తలకొండపల్లి : 11,639
ఫరూఖ్నగర్ : 11,847
కొందుర్గు : 6,833
మొత్తం : : 1,70,526