వికారాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : నేరాల నియంత్రణే లక్ష్యంగా వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా నేను సైతం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గ్రామాల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించింది. గ్రామస్తుల సహకారంతో ప్రతి గ్రామంలోనూ సీసీ కెమెరాల నిఘాను ఏర్పాటు చేస్తున్నది. సీసీ కెమెరాల ఏర్పాటు ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుండడంతో చాలామంది స్వచ్ఛందంగా ముందుకొస్తూ విరాళాలు అందజేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో మొత్తం 566 గ్రామ పంచాయతీలుండగా.. ఇప్పటివరకు దాదాపు 500 గ్రామ పంచాయతీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ‘కమ్యూనిటీ సీసీ టీవీ’ల పేరిట జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా గత ఐదేండ్లలో 5071 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
జిల్లాలో నేరాల నియంత్రణకు జిల్లా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ‘నేను సైతం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గ్రామాల్లోనూ నేరాల అదుపు చేసేందుకు నిఘా పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామస్తుల సహకారంతో జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ జిల్లా పోలీసు యంత్రాంగం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నది. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తున్నది. గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ గ్రామ భద్రతలో మేము సైతం అంటూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు తమ వంతు సహకారంగా విరాళాలు అందజేస్తున్నారు.
ఇప్పటికే పట్టణాల్లోని ప్రధాన కూడళ్లతోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పోలీసులు గ్రామాల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలను పూర్తిగా అదుపు చేసే దిశగా ముందుకెళ్తున్నారు. జిల్లాలో 566 గ్రామపంచాయతీలుండగా ఇప్పటివరకు దాదాపు 500 గ్రామపంచాయతీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరోవైపు జిల్లాలోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంపై ఎస్పీ కోటిరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు నేను సైతం కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఆయా పోలీస్ స్టేషన్ల సీఐలకు, ఎస్ఐలకు ఆదేశించడంతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఇప్పటివరకు దాదాపు 500 గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలను నియంత్రించడమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం ముందుకెళ్తున్నది. జిల్లాలో 566 గ్రామపంచాయతీలకు ఇప్పటివరకు దాదాపు 500 గ్రామపంచాయతీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రజల భద్రతే ప్రధానంగా పోలీసు శాఖ చేపట్టిన నేను సైతం కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. నేను సైతం కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అవగాహన కల్పిస్తుండగా, జిల్లాలోని మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లలో కమ్యూనిటీ సీసీ టీవీల పేరిట జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఇప్పటివరకు గత ఐదేండ్లలో నేను సైతం, కమ్యూనిటీ సీసీ టీవీల్లో భాగంగా 5071 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 2018లో 377, 2019లో 764, 2020లో 939, 2021లో 796, 2022లో 2195 సీసీ కెమెరాలను గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేశారు.