తాండూరు నియోజకవర్గం ప్రగతి దిశగా పరుగులు పెడుతున్నది. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి బయటపెట్టినందుకు సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. మొత్తం రూ.500 కోట్ల పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ఎమ్మెల్యే ప్రభుత్వానికి పంపించగా.. ఇప్పటికే రూ.300 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి రూ.50 లక్షల చొప్పన మంజూరు చేశారు. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, ఇండస్ట్రియల్ పార్కు, వ్యవసాయ మార్కెట్, పాత తాండూరు ఫ్లైఓవర్, ప్రధాన రోడ్ల విస్తరణ, ప్రభుత్వ ఐటీఐ కాలేజీ, ఆటోనగర్ నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తదితర పనులు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి చొరవతో నియోజకవర్గానికి మంజూరయ్యాయి. రూ.20 కోట్లతో జినుగుర్తిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయనుండగా, భూ సేకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. రోడ్ల విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి.
వికారాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : తాండూరు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. గతంలో ఎన్నడూలేని విధంగా తాండూరు నియోజకవర్గానికి భారీగా నిధులొచ్చాయి. పార్టీ మారేందుకు ఎర చూపిన నిందితులను తెలంగాణ ప్రజల ముందుకు తీసుకువచ్చిన తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి నియోజకవర్గానికి ఏడాదిలోనే రికార్డు స్థాయిలో నిధులు మంజూరు చేయించారు. అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడి ఉన్న తాండూరు నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. నియోజకవర్గానికి ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, ఇండస్ట్రియల్ పార్కు, వ్యవసాయ మార్కెట్, పాత తాండూరు ఫ్లైఓవర్, ప్రధాన రోడ్ల విస్తరణ, ప్రభుత్వ ఐటీఐ కాలేజీ, ఆటోనగర్ నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తదితర అభివృద్ధి ప్రాజెక్టులను మంజూరు చేయించి తాండూరు నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే రంజిత్రెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారు. తాండూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రూ.500 కోట్లకుపైగా పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపాదించిన నిధుల్లో ఇప్పటికే రూ.300 కోట్లకుపైగా నిధులు మంజూరయ్యాయి. రాష్ట్రంలోనే తాండూరు నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉండేలా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. పనులన్నీ పూర్తయితే తాండూరు నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.
తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి రూ.500 కోట్లు
తాండూరు నియోజకవర్గ దశ-దిశ మార్చేలా ఎమ్మెల్యే పైలట్ ప్రగతి కార్యక్రమాలను చేపట్టారు. ఏడాదిలోనే రూ.500 కోట్ల నిధులు రాబట్టారు. ఇప్పటికే రూ.300 కోట్లకుపైగా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిపాదించిన మిగతా నిధులకు సంబంధించి కూడా పరిపాలన అనుమతులు వారం, పది రోజుల్లో వచ్చేలా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు. తాండూరులో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ప్రధాన రోడ్డు విస్తరణ పనులు జోరందుకున్నాయి. నియోజకవర్గానికి మంజూరైన ఇండస్ట్రియల్ పార్కుతోపాటు బీసీ భవన్, ఐటీ కాలేజీ, వ్యవసాయ మార్కెట్ యార్డు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఆటోనగర్ నిర్మాణానికి స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తికాగా, కేవలం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి స్థలాన్ని గుర్తించాల్సి ఉంది. మరోవైపు తాండూరు మున్సిపాలిటీలోని ప్రతి వార్డుతోపాటు నియోజకవర్గంలోని గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయించారు. నియోజకవర్గంలోని ఏ ఒక్క గ్రామపంచాయతీ కూడా అభివృద్ధిలో వెనుకబడి ఉండకుండా ప్రతి గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులకుగాను ఒక్కో గ్రామపంచాయతీకి రూ.50 లక్షల నిధులను ప్రత్యేకంగా కేటాయించారు. మున్సిపాలిటీలోని ప్రతి వార్డుకు రూ.కోటి చొప్పున నిధులను కేటాయించారు.
ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ నిర్మాణం, ఫర్నిచర్ తదితరాల నిమిత్తం రూ.25 కోట్ల నిధులను కూడా ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ కోర్సులకు సంబంధించి 60 సీట్లను మంజూరు చేశారు. త్వరలోనే నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి స్థలాన్ని గుర్తించి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. నర్సింగ్ కాలేజీ మంజూరుతో జిల్లాలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచితంగా నర్సింగ్ కోర్సు పూర్తి చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. రూ.10.20 కోట్లతో తాండూరు మండలంలోని తాండూరు, జిన్గుర్తితోపాటు యాలాల మండలం జుంటుపల్లి, పెద్దేముల్ మండలం కందనెల్లిలో 33/11 కేవీ సబ్స్టేషన్ల ఏర్పాటుకుగాను నిధులను ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేయగా, త్వరలో టెండర్ల ప్రక్రియను చేపట్టనున్నారు.
ప్రగతి పథంలో తాండూరు నియోజకవర్గం
తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి గతంలో ఎన్నడూలేని విధంగా భారీగా నిధులు మంజూరయ్యాయి. నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచాను. ప్రతిపాదించిన అభివృద్ధి పనుల్లో మెజార్టీ నిధులు మంజూరయ్యాయి. అభివృద్ధి పనులకు సంబంధించి స్థల సేకరణ ప్రక్రియ పూర్తైన పనులకు టెండర్ల ప్రక్రియను చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించాం. నియోజకవర్గ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– ఎమ్మెల్యే రోహిత్రెడ్డి