రంగారెడ్డి, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పారిశ్రామిక ప్రభ వెలిగిపోతున్నది. పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. పరిశ్రమలు ఏర్పాటు చేసిన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు యాజమాన్యాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద ప్రభుత్వానికి నిధులను అందజేసి ప్రగతికి ఊతమిస్తున్నారు.
లాభాల్లో కొంత వాటాను సీఎస్ఆర్కు కేటాయిస్తూ సామాజిక కార్యక్రమాలతోపాటు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పారిశ్రామిక వేత్తలు భాగస్వామ్యులవుతున్నారు. పరిశ్రమల ఏర్పాటు తర్వాత అనేక మారుమూల ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి. భూములకు డిమాండ్ రావడంతోపాటు ఉద్యోగ, ఉపాధి పరంగా అనేక వర్గాలకు ప్రయోజనం కలిగింది.
చేవెళ్ల నియోజకవర్గంలోని చందనవెల్లి ఒకప్పుడు మారుమూల ఆవాసం. పరిశ్రమల ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతం ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. చేవెళ్ల పట్టణ కేంద్రానికి 10-12 కి.మీ. దూరంలో ఉన్న షాబాద్ మండలంలోని చందనవెల్లి నేడు భారీ పరిశ్రమలకు గమ్యస్థానంగా మారింది. చందనవెల్లిలో ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి కోసం 2,060.34 ఎకరాలను కేసీఆర్ ప్రభుత్వం కేటాయించింది.
ఇందులో 1,569.89 ఎకరాల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ మేరకు టీఎస్ఐఐసీ లే అవుట్ చేసి 799 ఎకరాల్లో 194 ప్లాట్లు చేసి విడుతల వారీగా కంపెనీలకు ప్లాట్లను కేటాయిస్తూ వచ్చింది. మేధా సర్వో డ్రైవ్స్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, దైఫుకు, నికోమాక్ తైకిషా వంటి పెద్ద కంపెనీలు ఇక్కడ ఏర్పాటై ఉద్యోగ, ఉపాధిని కల్పిస్తున్నాయి.
పరిశ్రమలు ఏర్పాటైన చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలు పలు రకాలుగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. కోవిడ్ సమయంలో కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు అంబులెన్స్తోపాటు వైద్యపరంగా చేయూతనందించాయి. మరోవైపు సీఎస్ఆర్ నిధులతో మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పాటునందిస్తూనే పలు ప్రాంతాల్లో విద్య, వైద్య, శిక్షణా పరంగానూ చర్యలు తీసుకుంటున్నాయి.
పరిశ్రమలు విస్తరించడంతో ఇబ్రహీంపట్నం, కందుకూరు, షాద్నగర్, చేవెళ్ల తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రధాన రహదారుల వెంట భూమి ధర రూ.కోట్లలో పలుకుతున్నది. రహదారికి 5-10కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లోనూ భూములకు మంచి డిమాండ్ వచ్చింది. గతంలో వలస వెళ్లే యువకులు ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి పరిశ్రమలలో పని చేస్తూ ఉపాధి పొందుతున్నారు.
పరిశ్రమలు ఏర్పాటైన ప్రాంతాల్లో అద్దెకు ఇల్లు దొరకడమే కష్టంగా మారింది. బీహార్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ర్టాల నుంచి పని చేయడానికి జిల్లాకు వస్తున్నారు. వివాహం కాని వారికి పరిశ్రమలో ఉచితంగా వసతి కల్పిస్తున్నారు. కుటుంబంతో కలిసి ఉండాలంటే బయట అద్దెకు ఇల్లు తీసుకోవాల్సిందే. అద్దె ఇల్లుకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో పరిశ్రమల చుట్టూ కొత్తగా గృహాలు వెలుస్తున్నాయి.
పరిశ్రమల ఏర్పాటుతో చిరు వ్యాపారులకు సైతం లాభం చేకూరుతున్నది. పరిశ్రమలకు వెళ్లే దారిలో హోటళ్లు, దుకాణాలు సైతం వెలిశాయి. వివిధ రకాల వ్యాపారులతో అనేక వర్గాలు జీవనోపాధి పొందుతున్నాయి.