పేదలను దోచి పెద్దలకు పెడుతున్న కేంద్ర సర్కార్ ఆది నుంచి సంపన్నులకు కొమ్ముకాస్తూ పేదల నడ్డి విరుస్తున్నది. ఇదివరకే పలుమార్లు చమురు ధరలు పెంచగా, మంగళవారం మరోసారి గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచి ప్రజలకు షాకిచ్చింది. వంటగ్యాస్ సిలిండర్ ధరపై రూ.50, వాణిజ్య సిలిండర్పై ఏకంగా రూ.350 పెంచి పెనుభారం మోపింది. ఇప్పటికే ఆకాశన్నంటిన నిత్యావసరాల ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు గ్యాస్ ధర పెంపు గుదిబండలా మారింది. కేంద్రం నిర్ణయంతో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1155లకు, వాణిజ్య సిలిండర్ ధర రూ.2300కు చేరింది. దీంతో రెక్కాడితేగాని డొక్క నిండని పేదలు కట్టెల పొయ్యివైపు చూసే దుస్థితి నెలకొన్నది. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరల పెంపుతో సామాన్యుల బతుకు భారంగా మారిందని మండిపడుతున్నారు. పెంచిన గ్యాస్ ధరలను కేంద్రం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది.
వికారాబాద్, (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం, మార్చి 1 : కేంద్ర ప్రభుత్వం మరోమారు వంటగ్యాస్ ధరలను పెంచింది. అదానీలాంటి సంపన్నుల కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు మాత్రం వరుస షాక్లిస్తున్నది. ఇప్పటికే పెట్రో ధరల బాదుడు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఉక్కిరి బిక్కిరవుతున్న సామాన్యులకు వంట గ్యాస్ ధర పెరుగడంతో ప్రజలపై మరో భారం పడింది. ఆరు నెలల కిందే వంట గ్యాస్, కమర్షియల్ సిలిండర్ ధరను పెంచిన కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. వంట గ్యాస్ సిలిండర్ ధరపై రూ.50లు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.350 పెంచింది.
పెంచిన ధరలతో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1155 చేరడం గమనార్హం. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. గతేడాది ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగిసే వరకు గ్యాస్ ధరలను పెంచని కేంద్రం, ఆ తర్వాత వరుసగా పెట్రో ధరలను పెంచడంతోపాటు గ్యాస్ ధరలను పెంచుతూ బాదుతుంది. కమర్షియల్ సిలిండర్ ధర పెరుగడం ఈ ఏడాదిలో రెండోసారి కావడం గమనార్హం.
ఈ ఏడాది జనవరిలోనే కమర్షియల్ సిలిండర్ ధరలను పెంచిన కేంద్రం, మరోసారి రూ.350 మేర పెంచుతూ నిర్ణయించింది. చాలిచాలని జీతాలతో బతుకుతున్న పేదలకు గ్యాస్, పెట్రో బాదుడు ఆందోళన కలిగిస్తున్నది. మళ్లీ కట్టెలపొయ్యి వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోదీ పాలనలో ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు.. అన్న చందంగా మారిందని సబ్బండ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
సామాన్యుల నెత్తిన ధరల పెంపు పిడుగు పడింది. గ్యాస్ ధరలు తరచూ పెంచడం బీజేపీ ప్రభుత్వానికి తగదు. కేంద్ర ప్రభుత్వం పెద్దోళ్లకు దోచిపెట్టి పేదోళ్లను ముంచుతున్నది. గతంలో సిలిండర్ ధర పెరిగితే సబ్సిడీ కూడా పెరిగేది. ఇప్పుడు సబ్సిడీని ఎత్తివేయడం బాధాకరం. బీజేపీకి తగిన గుణపాఠం తప్పదు.
– కావలి సురేఖ మధు, రాస్నం సర్పంచ్,
యాలాల మండలం
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలి. ఇప్పటికే నిత్యావసర ధరలు పెంచింది. దీనికి తోడు గ్యాస్ ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నది. కట్టెల పొయ్యిపై ఆధారపడే రోజులు మళ్లీ వస్తున్నాయని అనిపిస్తున్నది. పేదలను మోసం చేస్తున్న కేంద్రంలోని బీజేపీని గద్దె దించాల్సిందే.
– పీరంపల్లి రాజు, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కులకచర్ల
కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకు ప్రజా వ్యతిరేక విధానాలకు ఆజ్యం పోస్తూ.. పేదల జీవన విధానానికి ఉచ్చు బిగిస్తున్నది. బీజేపీ పాలనలో వంట గ్యాస్, నూనె, నిత్యావసర సరుకులు, ధాన్యపు గింజలు కొనాలన్నా ముచ్చెమటలు పుట్టిస్తూ.. పేద ప్రజలను ప్రశాంతంగా వండుకుని తినే స్వేచ్ఛ లేకుండా చేసింది. కార్మిక, కర్షక, పేద, మధ్య తరగతి ప్రజలపై కక్ష గట్టి రాక్షసతత్వం చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నాం. పెంచిన రేట్లు వెంటనే తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
– డాక్టర్ మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు
గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యులపై పెనుభారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వానికి రాబోవు రోజుల్లో తగిన గుణపాఠం తప్పదు. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్, నిత్యావసర ధరలను పలుమార్లు పెంచింది.
– రామకృష్ణ, హైతాబాద్(షాబాద్)
నిత్యసర ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీనికి తోడు గ్యాస్ ధరల పెంచి సామాన్యులకు మోయలేని భారాన్ని కేంద్రం మోపుతున్నది. బీజేపీ ప్రభుత్వానికి రాబోవు రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. ఇప్పటికైనా పెంచిన ధరలను తగ్గించాలి.
– వేణుగోపాల్, ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కొడంగల్
కేంద్రం ప్రభుత్వం రోజురోజుకి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ ఇబ్బంది పెడుతున్నది. పెరిగిన ధరల కారణంగా ఇల్లు గడువడమే గొప్ప విషయంగా మారుతున్నది. మళ్లీ కట్టెల పొయ్యే నయమనిపిస్తున్నది.
– లక్ష్మి, ఎన్కతల, మోమిన్పేట