సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ): నేరాలు తగ్గిస్తూ, జరిగిన నేరాల్లో నేరస్తులకు పక్కాగా శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సిబ్బందికి సూచించారు. ఐటీ కారిడార్ అయిన మాదాపూర్ జోన్లోని అన్ని పోలీస్స్టేషన్ల సిబ్బందితో మంగళ వారం ఆయన నేర నియంత్రణ, కేసుల దర్యాప్తులో తీరు తెన్నులపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోనే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, నార్సింగ్ తదితర పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న ఐటీ కారిడార్లో వివిధ దేశాల నుంచి వచ్చే వ్యాపారులు పెట్టుబడులు పెడుతుండటంతో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి ఉంచాలని, నేర నియంత్రణ, శాంతి భద్రతలు నిరంతరం అదుపులో ఉన్నప్పుడే మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మరిన్ని పెరుగుతాయని సూచించారు. 2023లో అన్ని పోలీస్స్టేషన్ల సిబ్బందికి నేర నియంత్రణలో సాధించాల్సిన లక్ష్యాలపై దిశా నిర్దేశం చేయశామన్నారు. విజిబుల్ పోలీసింగ్, ప్రో యాక్టివ్ పోలీసింగ్ పద్ధతులను అవలంబిస్తూ గస్తీ వాహనాలు ఎల్లవేళల తిరుగుతూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు. నమోదవుతున్న కేసులను నాణ్యమైన పద్ధతుల్లో దర్యాప్తు చేసి, అన్ని ఆధారాలతో చార్జిషీట్లు వేయాలన్నారు. ఆ తర్వాత ఆ కేసులోని నిందితులకు తప్పని సరిగా శిక్షలు పడే విధంగా చూసుకోవాలని సూచించారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, తదనుగుణంగా పాయింట్ బుక్స్ ఏర్పాటు చేసి నిఘా పెంచాలన్నారు. ఎంఓ క్రిమినల్స్, హిస్టరీ షీటర్స్, రౌడీషీటర్ల కార్యకలాపాలపై స్థానిక ఎస్హెచ్ఓలు నిఘా పెంచి, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొనకుండా, ప్రశాంతతకు భంగం కల్గించకుండా చూడాలన్నారు. రీపీటెడ్ అఫెండర్స్పై పీడీ యాక్టుల నమోదు, సీసీటీవీల ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వర్, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, అడ్మిన్ డీసీపీ ఇందిరా, సైబర్క్రైమ్స్ అదనపు డీసీపీ రితిరాజ్, మాదాపూర్ అనదపు డీసీపీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.