ఇబ్రహీంపట్నం రూరల్, మే 9 : పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో సెలవు రోజుల్లో పిల్లలకు విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందిందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. పోటీ ప్రపంచంలో కాలక్షేపం కాకుండా వారిలోని స్కిల్స్ను మెరుగుపర్చే శిక్షణ ఇప్పించేందుకు కృషి చేయాలి. పెద్ద పిల్లలైతే వారు చదివేకోర్సుకు ఉపయోగపడే అదనపు విషయాలను నేర్పేచోటికి పంపాలి. క్రీడలతోపాటు అనేక రకాలుగా మన జీవితంలో ఉపయోగపడే విషయాలను పిల్లలు నేర్చుకునేలా చూడాలి. విద్యతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్పై సాధన చేస్తే భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్లే. చాలా మంది యువకులు ఈ నైపుణ్యం లేక వెనుకబడిపోతున్నారు. మనదేశంలో ఒక ప్రముఖ సంస్థ ఈ విషయమై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం దేశంలో కేవలం 19 శాతం యువకులు మాత్రమే కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉన్నారని తెలిపింది. జీవితంలో ఉపయోగపడే విషయాలను పిల్లలు నేర్చుకునేలా చూడడం వల్ల సెలవులు ఈజీగా గడిపేయవచ్చునని వైద్య నిపుణులు అంటున్నారు.
మెదడుకు మేతతో మెమరీకి ఊతం..
చిన్నారుల మెదడును చురుకుగా ఉంచాలంటే దానికి ఎప్పుడు ఏదో పని చెప్పాలి. అందుకే పిల్లల మెదడును చురుకుగా ఉంచే ప్రతి ప్రయత్నాన్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. చదరంగం ఆట, సుడోకు వంటి పజిల్స్ మెదడును ఉత్తేజ పరుస్తాయి. తల్లిదండ్రులు మీ పిల్లల అబిరుచిని బట్విట పజిల్స్తో చిన్నపాటి రీజనింగ్ నేర్పించాలి.
పదసంపదను పెంచండి..
నేటి ఆధునిక యుగంలో ఏ భాషలోనైనా పట్టును అందించాలి. పదం కోసం పరితపించే సంభాషణను మననం చేసుకుంటూ ఉండాలి. మన పేరు గుర్తుకొచ్చినంత సులభంగా పదాలు గుర్తుకొస్తాయి. స్కూల్, కళాశాలలో చదువుతున్న రోజుల్లో అంత సమయము ఉండదు. కాబట్టి సెలవుల్లో పద పరిజ్ఞానంపై దృష్టి పెడితే భాషపై పట్టు సాధించడం సులభమవుతుంది.
చేతిరాత మెరుగుతో మార్కులు అధికం..
పరీక్షల్లో చేతిరాత చాలా ముఖ్యం. ఏ పరీక్ష అయినా మీరే రాసే సమాధానాలను మంచి చేతిరాతతో రాస్తే చదవడానికి ఎంతో బాగుంటుంది. దీంతో ఆయా పరీక్షల్లో మంచి మార్కులు వచ్చే అవకాశముంది. పాఠశాలలో చేతిరాత బాగాలేక టీచర్లచేత చివాట్లు తిన్న వారంతా ఈ సెలవుల్లో చేతిరాత మెరుగుపరిచే శిక్షణా తరగతులకు వెళ్లడం మంచిది. పట్టణాల్లో కాలిగ్రఫీ నిపుణులు ప్రత్యేక శిక్షణ తరగతులు పెట్టి చేతిరాతపై శిక్షణ ఇస్తుంటారు. వీటికి సంబంధించిన డీవీడీలు, పుస్తకాలు కూడా మార్కెట్లో లభిస్తాయి. రోజుకి గంట సమయాన్ని కేటాయిస్తే మీ చేతిరాతను మెరుగుపర్చుకోవచ్చు.
భాషపై పట్టుతో భవితకు నాంది..
భాషమీద పట్టు అవసరం. అది తెలుగు లేదా ఇంగ్లిష్ ఏదైనా కావచ్చు. తెలుగు మాతృభాష అయితే ఇంగ్లిష్ బతుకుభాష. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా సంభాషించడానికి ఇంగ్లిష్ అవసరం. భాష వేరు కమ్యూనికేషన్ స్కిల్స్ వేరు. భాష అనేది అందులో ఒక భాగం మాత్రమే. కాబట్టి భాష మీద పట్టు లేకపోతే కమ్యూనికేషన్ కూడా దెబ్బ తింటుంది. కాబట్టి వేసవి సెలవుల్లో భాషపై దృష్టి పెడితే అది జీవిత కాలమంతా మనల్ని కాపాడుతుంది. ఒక స్థాయిలో నిలబెడుతుంది.
టెక్నాలజీ సొంతం చేసుకోవాలి..
నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ వినియోగం లేనిదే ఏ పనీ జరుగడం లేదు. నేడు కంప్యూటర్ టెక్నాలజీ ప్రతి వ్యక్తికి ప్రాథమిక అవసరం. రానున్న రోజుల్లో ఉద్యోగ పరీక్షలన్నీ ఆన్లైన్లోనే జరిగే అవకాశం ఉన్నది. అందుకే ప్రతి ఒక్కరికీ కంప్యూటర్ టెక్నాలజీని నేర్చుకోవడం ఎంతో అవసరం. ఎంఎస్వర్డ్, ఎంఎస్ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్ వస్తే వివిధ ఆఫీసుల్లో చిన్నచితకా ఉద్యోగాలు గ్యారంటీ.
పుస్తకాలు చదువండి..
సెలవుల్లో రోజుకు గంట సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయిస్తే ఎంతో విజ్ఞానం పెరుగుతుంది. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి. పిల్లల్లో ఉత్తేజాన్ని కలిగించేవి, వారి భవిష్యత్తుకు, పరిజ్ఞానానికి ఉపయోగపడే పుస్తకాలను వారికి అందుబాటులో ఉంచి అవి చదివేలా చూడాలి. ఉదాహరణకు సమయపాలన, భావోద్వేగాల అదుపు, మైండ్ మేనేజ్ వంటి పుస్తకాలు చదివితే విద్యార్థుల్లో ఉత్తేజంతో పాటు ఆత్మవిశ్వాసం కలుగుతుంది.
ఆటలు, వ్యాయామంపై ఏకాగ్రత తప్పనిసరి..
వ్యాయామాలు మిమల్ని ఫిజికల్గా, ఫిట్గా ఉంచుతాయి. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుతాయి. మీలో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తాయి. రోజుకు గంటపాటు వ్యాయామాలు చేస్తే మరో పూట తప్పక ఆటలు ఆడండి. వేసవిలో కొంత మంది ప్రత్యేక శిక్షకులు వ్యాయామాలపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. వీటికి హాజరు కావడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది. దీంతో పాటు ఏకాగ్రత, మెమరీ ప్రాసెస్ కూడా మెరుగవుతాయి.
స్విమ్మింగ్ తప్పనిసరి..
భవిష్యత్తులో స్విమ్మింగ్ అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమైనది. స్విమ్మింగ్ కోసం ప్రత్యేకించి సమయం లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఈతకు దూరమవుతున్నారు. వేసవి సెలవుల్లో దగ్గరలో ఉన్న స్విమ్మింగ్ఫూల్స్కు వెళ్లి ఈత నేర్చుకోవడం ఎంతో అవసరం. ఇందుకనుగుణంగా స్విమ్మింగ్పూల్స్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు.
స్ఫూర్తివంతమైన ప్రసంగాలు వినండి..
జీవన రంగంలో అత్యున్నత స్థానాలను అందుకొని పలువురికి ఆదర్శంగా ఉన్న స్ఫూర్తిదాతల ప్రసంగాలను వినడాన్ని పిల్లలకు అలవాటు చెయ్యాలి. అవి పిల్లలను ఆశాజనకమైన భవిష్యత్తు వైపు నడిపిస్తాయి. ఈ వేసవి సెలవుల్లో రోజుకు ఒక గంట సమయాన్ని కేటాయించి అంతర్జాలంలో ఉన్న వీరి ప్రసంగాలను విన్నవారంతా ఆదర్శవంతమైన జీవితాన్ని గడపడానికి ఎన్నో అనుభవాల్ని సొంతం చేసుకుంటారనే విషయం వారికి తెలియజేయాలి.
ప్రతిభకు పదును పెట్టుకోవడం..
చాలా మంది విద్యార్థులు గణిత శాస్త్రంలో మంచి మార్కులు సాధించడానికి అబాకస్, వేద్ గణితం, స్పీడు మాథ్స్లాంటి ప్రత్యేక విజ్ఞానాన్ని సంపాదించుకుంటారు. వేసవిసెలవుల్లో బాగా సాధన చేసి స్కూల్ తిరిగి ప్రారంభించిన తరువాత వారి ప్రతిభను పెంచుకుని మంచి మార్కులను సంపాదించుకోవచ్చు. నేర్చుకునే సమయంలో ఇష్టంతో నేర్చుకోవడాన్నే ఎంజాయ్మెంట్ అని విద్యార్థులు, తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పాలి. ఆ దిశగా వారిని అలవాటు చెయ్యాలి.
విద్యార్థులపై తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలి
సెలవు రోజుల్లో సమయాన్ని వృథా చేసుకోకుండా, వారి దృష్టి ఇతర విషయాలపైకి వెళ్లకుండా వ్యాయామం, విద్య, వినోదం లాంటి వాటిపై దృష్టి సారించేలా తల్లిదండ్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. పాఠశాలలకు వెళ్లినప్పుడే చదువుకోవాలనేది కాకుండా సెలవు రోజుల్లో కూడా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారు జీవితంలో సాధించాల్సిన వాటిపై దృష్టి సారించేందుకు కృషి చేయాలి.
– పరమేశ్, ఉపాధ్యాయుడు
ఆటలు, వ్యాయామంతో నూతనోత్తేజం..
విద్యార్థులు ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట, రెండు గంటల పాటు క్రీడలు, వ్యాయామంపై దృష్టి సారిస్తే నూతన ఆలోచనలు వస్తాయి. మెమరీకూడా షార్ప్గా అవుతుంది. తల్లిదండ్రులు సెలవుల్లో పిల్లలు సమయాన్ని వృథా చేసుకోకుండా చూసుకోవాలి. వ్యాయామంతో పాటు బాడిఫిట్గా ఉండడంతో పాటు విద్యలో కూడా ముందుంచేందుకు ఎంతో కృషి చేస్తుంది.
– శ్రీలేఖ, వైద్యురాలు