షాబాద్, మార్చి 21 : తెలుగువారి కొత్త సంవత్సరం రానే వచ్చింది. నేడు (బుధవారం) శోభకృత్ నామ ఉగాది పండుగను ఘనంగా జరువడానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో ముందుకు సాగుతున్నది. గత ఏడాది శుభకృత్నామ సంవత్సరంలో అంతా శుభంగా జరగడంతో.. ఈ ఏడాది శోభకృత్నామ సంవత్సరంలో కూడా అంతా శుభం జరిగి, జిల్లా మరింత అభివృద్ధి చెందనున్నది. ఐటీ మంత్రి కేటీఆర్ సహకారంతో వివిధ దేశాల నుంచి రంగారెడ్డిజిల్లాకు పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చారు. చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలం చందనవెళ్లిలో 2వేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన వివిధ రకాల పరిశ్రమలతో ఈ ప్రాంతానికి కొత్త రూపు సంతరించుకున్నది. దీంతో పాటు ఈ ఏడాది కూడా సీతారాంపూర్లో సుమారు 1200 ఎకరాల్లో ఎలక్ట్రికల్ వాహనాల తయారీ కంపెనీ ప్రారంభం కానుంది.
శంకర్పల్లి మండలం కొండకల్లో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో కూడా భారీ కంపెనీలు రావడంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, కొత్త ఏడాదిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను మరింత అభివృద్ధి చేయనున్నారు. దీంతోపాటు పేదల సంక్షేమానికి అనేక పథకాలు ప్రభుత్వం అమలు చేస్తున్నది. కొత్త ఏడాదిలో మరిన్ని పథకాలు ప్రవేశపెట్టనున్నారు. పేదలకు ఎంతో లబ్ధిచేకూరనుంది. ఈ ఉగాది అందరి జీవితాల్లో నూతన మార్పు తీసుకువస్తుందని ఆకాంక్షిస్తున్నారు. నూతన వస్తువుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. రైతులు ఏరువాకకు సిద్ధమవుతున్నారు. వాస్తవంగా ఈ నూతన సంవత్సరారంభం.. తెలుగు వారి జీవితాల్లో మహత్తర ఘట్టంగా చెప్పవచ్చు.
ఉగాది అంటే రైతన్నల ఏరువాక పండుగ
రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతకు ఇబ్బందులు లేకుండా సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతోపాటు రైతు బంధు ద్వారా పెట్టుబడి సాయం, రైతు బీమా ద్వారా కుటుంబాలకు బీమా సౌకర్యం, రైతులు పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తున్నది. ఉగాది పండుగ రోజున రైతన్నలు తమ హలాల(నాగళ్లు)కు పూజలు చేసి పొలంలో ఏరువాకను చేస్తారు. ఏడాది పొడవునా తమ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖమయ జీవనం సాగాలని, పంటలు సమృద్ధిగా పండాలని భగవంతుడిని ప్రార్థిస్తారు. ఉగాదికి ఒకటి, రెండు రోజుల ముందు చెరుకు, బెల్లం, కందమూలాలు, పసుపుకొమ్మలు, మోకులు, పల్పులు, ములకర్ర తదితర సామగ్రి కొనుగోలు చేసుకుంటారు. కర్రనాగలిని కొత్తది తయారుచేస్తారు. లేదా పాత నాగలిని శుభ్రం చేస్తారు.
ఉగాది రోజు వేకువజామున ఏరు పూసేందుకు అవసరమైన సామగ్రిని సమకూర్చుకుంటారు. ఉగాది రోజున నాగలితో పొలంలో ఏరు పూయడం ఆనవాయితీ. అంతకుముందు గ్రామానికి చెందిన పురోహితులు ఏ కర్రతో తయారు చేసిన నాగలి వాడాలి, ఏ దిశగా ఏరు పూయాలన్నది వివరిస్తారు. పశువులశాలలో ఉన్న ఏడ్లకు పసుపురాసి కొత్త మోకు పల్పులు, ములకర్ర, పంచామృతం, కొబ్బరికాయ వంటి సామగ్రితో పొలం వెళ్లి ఏరుపూత పనులు చేపడుతారు. ఇళ్లలో గృహిణులు ముందుగా తయారు చేసిన పిండివంటలు రకాలను ఏరుపూత అనంతరం రైతు ఇంటికి రాగానే అందిస్తారు. ఆ తరువాత వేపపువ్వు, మామిడికాయలను తమ తమ ఇండ్లకు అందజేస్తారు. అ తరువాత గ్రామంలోని ఆలయం వద్ద నిర్వహించే పంచాంగశ్రవణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ఇండ్లలో తయారు చేసిన ఉగాది పచ్చడిని తింటారు. ఆర్థిక పరిపుష్టి గలవారు ఉగాది రోజున కొత్త వస్తువులు, వాహనాలు , బంగారం తదితర వాటిని కొనుగోలు చేస్తారు.
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
రంగారెడ్డి, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రి సబితారెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు చేకూరాలని ఆమె ఆకాంక్షించారు. ఉగాది పండుగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటున్నదని, ఇప్పటికే సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల అమలులో యావత్ దేశానికి తెలంగాణ మార్గదర్శకంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. దినదినాభివృద్ధి సాధిస్తూ, దేశంలో అగ్రగామిగా వెలుగొందుతున్న తెలంగాణ రాష్ట్రం కొత్త సంవత్సరంలో మరింత ప్రగతి సాధించాలని ఆమె ఆకాంక్షించారు.