బొంరాస్పేట, డిసెంబర్ 20 : గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది మేలో జరిగిన ఎస్సెస్సీ వార్షిక పరీక్షల్లో బొంరాస్పేట మండలంలోని బొట్లవానితండా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, చౌడాపూర్ మండలం కొత్తపల్లి బాలుర ఆశ్రమ పాఠశాల, పరిగి ఎస్టీ బాలుర వసతి గృహం విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఇందులో బొట్లవానితండా పాఠశాల వరుసగా మూడేండ్లు వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఈ విద్యా సంవత్సరం కూడా జిల్లాలోని అన్ని ఆశ్రమ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నారు. మెరుగైన ఫలితాల సాధనకు గిరిజన సంక్షేమ శాఖ వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నది. నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభమయ్యే వరకు కొనసాగుతాయి.
వికారాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో బొట్లవానితండా, బండవెల్కిచెర్ల, మర్పల్లి, కొత్తపల్లి, రాంపూర్లో ఐదు ఆశ్రమ పాఠశాలలు ఉండగా.. కులకచర్లలో ఒక బెస్ట్ అవైలబుల్ పాఠశాల ఉంది. వీటిలో 283 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. పరిగి, కొడంగల్, వికారాబాద్, ముజాహిద్పూర్, కలకచర్లలో ఒక్కో వసతి గృహం, తాండూరులో రెండు వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 215 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. మొత్తంగా 2023-24 విద్యా సంవత్సరంలో గిరిజన ఆశ్రమ పాఠశాలల నుంచి 498 మంది విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్షలకు హాజరవబోతున్నారు.
పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేకంగా మూడు రకాల కిట్లను గిరిజన సంక్షేమ శాఖ అందజేస్తున్నది. అకాడమిక్ కిట్లో ఒక్కో విద్యార్థికి మూడు లాంగ్ నోట్ బుక్స్, ఒక స్టడీ మెటీరియల్, ఒక కెరీర్ గైడెన్స్ బుక్, రైటింగ్ ప్యాడ్, స్కేలు, మ్యాప్ పాయింటింగ్, కంపాస్ బాక్స్, గ్రాఫ్ బాక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్, షార్ప్నర్ను అందిస్తున్నారు. యుటిలిటీ కిట్లో రెండు సబ్బులు, ఒక టూత్ పేస్ట్, ఒక టూత్ బ్రష్ అందిస్తున్నారు. న్యూట్రిషన్ కిట్ పేరుతో ఒక్కో విద్యార్థికి రోజూ రూ.20 చొప్పున ఖర్చు చేస్తున్నారు. ప్రతిరోజూ పాలతో బూస్ట్, టీ, బిస్కెట్లు, చిక్కీలు, అరటి పండ్లు, మహువా లడ్డూ ఇలా వారం రోజుల పాటు అందజేస్తున్నారు.
ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులను మూడు విభాగాలుగా విభజించి వారి చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. చదువులో రాణిస్తూ తెలివైనవారు, మధ్యస్థంగా ప్రతిభ కలవారు, చదువులో వెనుకబడి ప్రత్యేక శ్రద్ధ అవసరమైన వారు ఇలా మూడు విభాగాలుగా గుర్తించారు. వారిని సబ్జెక్టులవారీగా ఉపాధ్యాయులకు అప్పగించి తీర్చిదిద్దుతున్నారు. నవంబర్ నుంచి ప్రత్యేక తరగతుల నిర్వహణ ప్రారంభించారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ప్రతిరోజూ ఉదయం పరీక్షలు నిర్వహించి సాయంత్రం ఫలితాలు వెల్లడించి సమీక్షిస్తూ వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
వసతి గృహాలలోని పదో తరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతుల నిర్వహణకు ఆంగ్లం, గణితం, తెలుగు, సామాన్యశాస్త్రంలో బోధనకు ట్యూటర్లను నియమించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వసతి గృహాలలోనే ప్రత్యేక తరగతులు కొనసాగిస్తున్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థులకు తెలుగులో 16, హిందీలో 13, ఇంగ్లిష్లో 19, గణితంలో 20, ఫిజికల్ సైన్స్లో 17, బయోలాజికల్ సైన్స్లో 12, సాంఘిక శాస్త్రంలో 21 స్లిప్ టెస్టులు, క్యుములేటివ్ పరీక్షలు, ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఐదు ఆశ్రమ పాఠశాలలు, ఒక బెస్ట్ అవైలబుల్ పాఠశాల, ఏడు వసతి గృహాలలో ఈ ఏడాది పదో తరగతిలో వంద శాతం ఫలితాల సాధనే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా విద్యార్థులకు నవంబర్ నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు మంచి మార్కులు సాధించేలా స్టడీ మెటీరియల్ను అందిస్తున్నాం. ట్యూటర్లను నియమించి చదువు చెప్పిస్తున్నాం. 10/10 జీపీఏ సాధించడానికి కృషి చేస్తున్నాం. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకుని పదిలో మంచి ఫలితాలు సాధించాలి.
– కోటాజీ, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి, వికారాబాద్