రంగారెడ్డి, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : పరిపాలనలో మార్పులు తీసుకొచ్చేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ అనితా హరినాథ్రెడ్డి అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, శాసన సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి, ఈర్లపలి శంకర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ ఛైర్పర్సన్ అనితా హరినాథ్ రెడ్డి, కలెక్టర్ శశాంక పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలకు ఇప్పటి వరకు రూ.15 కోట్ల జీరో టికెట్లను అందించామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచామన్నారు. త్వరలోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా 200 యూనిట్లు కరెంట్, గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నారు.
తాగునీటి ఇబ్బందులు రావొద్దు..
మిషన్ భగీరథపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ వేసవి సీజన్ ప్రారంభమవుతున్న దృష్ట్యా అధికారులు తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. ఏ ఒక నివాస ప్రాంతంలోనూ నీటి ఎద్దడి ఉత్పన్నం కాకుండా, ఇంటింటికీ రక్షిత తాగునీటిని సరఫరా చేసేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. అవసరమైనచోట పైప్ లైన్ లీకేజీల మరమ్మతుల వంటి ప్రతి అంశంపై దృష్టి సారించాలన్నారు. కలెక్టర్ అనుమతితో బోర్లు వేసేందుకు అనుమతులు కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నీటి ఎద్దడిని శాశ్వతంగా పరిషరిస్తామని మంత్రి తెలిపారు. వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.4.5 కోట్లతో కార్యాచరణను రూపొందించినట్లు మిషన్ భగీరథ అధికారులు మంత్రికి వివరించారు.
విద్యా, వైద్యంపై చర్చ..
విద్యాశాఖపై చర్చ సందర్భంగా సభ్యులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను ప్రస్తావించారు. ఉపాధ్యాయల కొరత లేకుండా చేస్తామని, మార్చి 18వ తేదీ నుంచి జరిగే పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికలు రూపొందించామని డీఈవో సుశీందర్రావు తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అన్ని రకాల వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్, సిబ్బంది లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, కచ్చితంగా డాక్టర్, సంబంధిత సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు స్పందించి సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. జిల్లాలో బస్తీ దవాఖానల ద్వారా ప్రజలకు వైద్యం అందిస్తున్నామని, ఆరోగ్య మహిళా ద్వారా ప్రతి మంగళవారం కేవలం మహిళలకు పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో కచ్చితంగా డాక్టర్, సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పంచాయతీ శాఖ, మైనింగ్ శాఖ, వ్యవసాయ శాఖ, సంక్షేమ శాఖ, విద్యుత్ శాఖ, వివిధ శాఖలపై సమావేశంలో సమీక్షించారు. ఆయా శాఖలకు చెందిన జిల్లా అధికారులు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఇబ్రహీంపట్నం శాసన సభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి, షాద్నగర్ శాసన సభ్యుడు ఈర్లపల్లి శంకర్, జిల్లా కలెక్టర్ కె.శశాంక, జిల్లా ప్రజా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు, జడ్పీటీసీలు ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.