ఇబ్రహీంపట్నం : ఈ నెల 22న ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో వరుణార్చన, అభిషేకం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన చెరువును సందర్శించి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్రెడ్డి పర్యవేక్షణలో చేపట్టిన వరుణార్చన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన కార్తిక సోమవారం రోజున వేదపండితులచే మహా హోమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. పది సంవత్సరాల క్రితం పెద్ద చెరువు నిండాలని, ఇక్కడి ప్రాంతం సస్యశామలం కావాలని కోరుతూ వరుణయాగాన్ని నిర్వహించినట్లు ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుతం పెద్ద చెరువు పూర్తిగా నిండటంతో వరుణార్చన, అభిషేకం, హోమం కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రమేశ్గౌడ్, ఆకుల యాదగిరి, బూడిద రాంరెడ్డి, జర్కోని రాజు, భద్రినాథ్, రాజేశ్, ప్రసాద్, మంకాల దాసు, జగదీశ్, ప్రవీణ్నాయక్ తదితరులు ఉన్నారు.