ఇబ్రహీంపట్నం : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసిన రైతులపై కేంద్ర ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలకు దిగుతున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి విమర్శించారు. గురువారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నదాతలపై కక్ష్యగట్టిన బీజేపీ ప్రభుత్వం ఎరువుల ధరలను భారీగా పెంచిందని దుయ్యబట్టారు. రైతులపై ఉన్మాద ముద్రవేయటానికి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో నల్లచట్టాలను తప్పక రద్దుచేయాల్సిన పరిస్థితి కేంద్రానికి దాపురించిందని తెలిపారు.
మూడు నల్లచట్టాలను రద్దుచేసుకున్న బీజేపీ ప్రభుత్వం రైతులపై దొడ్డిదారిన నిలువుదోపడికి దిగిందని ధ్వజమెత్తారు. బీజేపీ తమ అనుబంధ కార్పొరేట్ శక్తులకు వ్యవసాయ రంగాన్ని దారాదత్తం చేయటానికి ప్రయత్నిస్తుందని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్కమిటీ మాజీ ఛైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.