ఇబ్రహీంపట్నం : హైదరాబాద్ శివారుల్లో విస్తరించి నూతనంగా ఏర్పడిన కాలనీల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన్నట్లు ఎమ్మెల్యే కిషన్రెడ్డి తెలిపారు. ఆదిబట్ల మున్సిపాలిటి పరిధిలోని 11వ వార్డులోని మైహోమ్స్ కాలనీ సమస్యలపై కాలనీవాసులు పైళ్ల శ్రీనివాస్రెడ్డి, కో-ఆప్షన్ సభ్యురాలు రేణుక సదానందం ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, పెద్దఅంబర్పేట్, మున్సిపాలిటీ పరిధిలో సుమారు 250 వరకు కొత్తగా ఏర్పడిన కాలనీలున్నాయి.
ఈ కాలనీల్లో మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నందున దీనిని దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయంజాల్, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీలు నగరంలో కలిసిపోతూ అత్యాధునిక హంగులతో కాలనీలు అభివృద్ధి చెందుతున్నాయని, వాటిని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.