ఇబ్రహీంపట్నం : ఆడబిడ్డల పెండ్లిలు చేసేందుకు తల్లిదండ్రులు ఆర్భాటాలకు పోయి అప్పులపాలు కావద్దని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల మున్సిపాలిటీలకు చెందిన 136 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదిముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల సంక్షేమం కోసం దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మీ, షాదిముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి వారి పెండ్లిలకు పెద్దన్నలా అండగా నిలుస్తున్నారన్నారు. కాని, పేదింటి ఆడబిడ్డల పెళ్లిలు చేసేందుకు చాలామంది తల్లిదండ్రులు ఆర్భాటంగా చేసి అప్పుల పాలవుతున్నారన్నారు.
ఇలాంటి పెళ్లిలు పూర్తిగా మరిచిపోయి అతి తక్కువ మందితో చేసుకుంటే ఎలాంటి ఆర్థిక సమస్యలుండవని తెలిపారు. ప్రభుత్వం ఇంతచక్కటి పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ ప్రతిపక్షపార్టీల నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని అన్నారు. ప్రజలు దీవించి గెలిపించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పడు ప్రజల అభ్యున్నతి కోసమే పనిచేస్తుందని తెలిపారు.