కాంగ్రెస్లో కుంపట్లు రగులుతున్నాయి. నిత్యం నిప్పు – ఉప్పులా ఉండే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి మధ్య మరో వివాదం వచ్చి పడింది. ఇబ్రహీంపట్నం టికెట్ ఇద్దరు నేతల మధ్య చిచ్చు పెట్టింది. మల్రెడ్డి రంగారెడ్డికి టికెట్ కోసం రేవంత్రెడ్డి హస్తినలో ప్రయత్నాలు చేస్తుండగా.. తన పార్లమెంటు పరిధిలో నీ పెత్తనమేందంటూ కోమటిరెడ్డి ఫైర్ అవుతున్నారు. ఇదే విషయమై హస్తిన వేదికగానే ఇద్దరు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కల్వకుర్తి కాంగ్రెస్లోనూ కసిరెడ్డి పంచాయితీ నడుస్తోంది. ప్యారాచూట్ నేతకు టికెట్ ఇస్తే ఊరుకునేది లేదంటూ సుంకిరెడ్డి భగ్గుమంటున్నారు. కసిరెడ్డికి మద్దతుగా వంశీచంద్ రెడ్డి వర్గం ఉంటూ సుంకిరెడ్డి వర్గంతో ఢీ అంటే ఢీ అంటూ పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టికెట్ కాంగ్రెస్ పార్టీలో తాజాగా మంటలు రేపుతున్నది. వాస్తవానికి భువనగిరి పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఈ స్థానం నుంచి తనకు అనుకూలమైన నేతను బరిలోకి దించేందుకు చాలాకాలంగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగం గా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మర్రి నిరంజన్రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎంపీపీ అయిన నిరంజన్రెడ్డి గతంలో స్థానిక సంస్థలకు సంబంధించి వివిధ హోదాల్లో పని చేశారు. స్థానికంగానూ మంచి పట్టుందనేది ఆయన వర్గం వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా మల్రెడ్డి రంగారెడ్డికి అవకాశం ఇస్తూ వస్తున్నందున పార్టీ అధిష్ఠానం ఈసారి నిరంజన్రెడ్డికి ఇవ్వాలనేది కోమటిరెడ్డి వర్గీయుల వాదన. ఇందుకు సంబంధించి కొన్ని ఉదాహరణలు కూడా వారు అధిష్ఠానం ముందు ఉంచుతున్నట్లు తెలిసింది.
ఉండే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి మధ్య మరో వివాదం వచ్చి పడింది. ఇబ్రహీంపట్నం టికెట్ విషయంలో ఇద్దరు నేతల మధ్య పంతం పెరిగింది. మల్రెడ్డి రంగారెడ్డికే టికెట్ ఇప్పించేందుకు రేవంత్రెడ్డి హస్తినలో ప్రయత్నాలు చేస్తుండగా… తన పార్లమెంటు పరిధిలోకి వచ్చే నియోజకవర్గంలో నీ పెత్తనం ఏందంటూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫైర్ అవుతున్నారు. దీంతో ఇటీవల హస్తిన వేదికగానే ఇద్దరు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. ముఖ్యంగా ఎవరికి వారు తగ్గేదేలే! అంటూ తమ వర్గం నేతల్ని ప్రోత్సహిస్తుండటంతో ఇబ్రహీంపట్నంలో ఎవరికి వారు తమదే టికెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీనికి తోడు మరో ఇద్దరు బీసీ నేతలు కూడా టికెట్ను ఆశిస్తుండటంతో ‘ఇదేం గోలరా బాబూ’ అనుకొని కాంగ్రెస్ శ్రేణులు కారెక్కుతున్నారు. అందుకే గత కొన్నిరోజులుగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సమక్షంలో నిత్యం కాంగ్రెస్ నుంచి వలసలు కొనసాగుతున్నాయి.
ఇదే అంశంపై ఇటీవల ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. మల్రెడ్డి కోసం రేవంత్ పట్టుబట్టగా.. నిరంజన్రెడ్డికి ఇవ్వాల్సిందే, నా పార్లమెంటు పరిధిలోనైనా కనీసం నాకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలాగంటూ కోమటిరెడ్డి భీష్మించుకు కూర్చున్నారు. ఈ క్రమం లో జరిగిన వాగ్వాదంలో కోమటిరెడ్డి అలిగి, అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. అనంతరం ఇబ్రహీంపట్నంలోని నిరంజన్రెడ్డికి ఫోన్ చేసి.. నీ పని నువ్వు చేసుకో! టికెట్ నీకే వస్తుందంటూ భరోసా కల్పించినట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం ఒకవైపు మల్రెడ్డి తనకే టికెట్ అంటూ ప్రచారం చేసుకుంటుండగా, మరోవైపు నిరంజన్రెడ్డి సైతం తనకే టికెట్ వస్తుందంటూ క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ టికెట్ ఆశావహుల్లో మరో ఇద్దరు బీసీ నేతలు కూడా ఉన్నారు. ముఖ్యం గా కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రెండు అసెంబ్లీ టికెట్లు బీసీలకు ఇస్తానని మాట ఇచ్చినందున, అందులో భాగంగా ఇబ్రహీంపట్నం టికెట్ తమకే ఇవ్వాలంటూ ఆ బీసీ నేతలు పట్టుబడుతున్నారు. ఇవన్నీ పరిణామాలతో నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, శ్రేణులు అయోమయంలో పడిపోయాయి. కాంగ్రెస్ తీరు మారేదా? పోయేదా? అంటూ శ్రేణులు రాజకీయంగా సర్దుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్నిరోజులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు గణనీయంగా పెరిగాయి. నిత్యం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సమక్షంలో అనేక గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకొంటున్నారు.
2009 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మల్రెడ్డి రంగారెడ్డికి పార్టీ అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.
2014 ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి మల్రెడ్డికి అవకాశం ఇచ్చారు. అక్కడ కూడా ఆయన ఓటమీ పాలయ్యారు.
2018 ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఇబ్రహీంపట్నం స్థానం టీడీపీకి పోయింది. అయినప్పటికీ మల్రెడ్డి రంగారెడ్డి పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి.. బీఎస్పీ నుంచి బరిలో నిలిచారు. అయినా ఆ ఎన్నికలోనూ ఆయనకు ఓటమి తప్పలేదు.
ఇలా అనేకసార్లు పార్టీ అవకాశం ఇచ్చినా, ఇవ్వకున్నా మల్రెడ్డి పోటీలో నిలిచారని, కానీ ఇన్నాళ్లూ పార్టీని నమ్ముకొని.. సేవలందిస్తున్న వారికి అవకాశం ఇవ్వడంలేదనేది కోమటిరెడ్డితో పాటు ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు.