పెద్దఅంబర్పేట, ఆగస్టు 27: ‘కనీసం 14 ఫీట్ల ఎత్తు ఉండాలె.. గల్లీల్లో ఏ వినాయకుడు లేని విధంగా బాగుండాలి.. ఈ విషయంలో తగ్గేదేలే’ అంటూ వినాయక ప్రతిమల కొనుగోళ్లకు సిద్ధమవుతున్నది యువత. చవితి పండుగకు మరో నాలుగు రోజులే ఉండటంతో.. పది రోజుల ముందు నుంచే వినాయక విగ్రహాలను ఎంపిక చేసుకునే పనిలో యువకులు బిజీగా ఉన్నారు. వినాయక ఉత్సవ కమిటీల సభ్యులు, పది మం ది స్నేహితులు ఎక్కడ కలిసినా వినాయక విగ్రహాల డిజైన్లపైనే చర్చ జరుగుతున్నది. యువకులు భారీ వినాయక విగ్రహాలు లభించే నగరంలోని ధూల్పేట, నగర శివారులోని ఉప్పల్, వనస్థలిపురం, పెద్దఅంబర్పేట, అబ్దుల్లాపూర్మెట్ వైపు వెళ్తున్నారు. ప్రతిచోటా తయారుచేస్తున్న వినాయక ప్రతిమలను పరిశీలిస్తున్నారు. లోటుపాట్లు బేరీజు వేసుకుంటూ.. బడ్జెట్ లెక్కలు చూసుకుంటున్నారు. డిజైన్లు మార్పించే పనిలో పడ్డారు. అదనపు హంగులు చేర్చేందుకు కొన్న వినాయక ప్రతిమలకు కిరీటాలు, సింహాసనాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆకట్టుకుంటున్న విగ్రహాలు
లాల్బాగ్ వినాయకుడు.. రాజసం ఉట్టిపడేలా, మహారాజు ఆశీనులైనట్లు. గొడుగు నీడన కనురెప్పలు సైతం మూయకుండా చూడాలనిపించేలా ఉండే ఈ వినాయకుడి ప్రతిమలకు పుణె ఫేమస్. ఇదే తరహాలో సోలాపూర్ వినాయకుడు, కోల్కతా గణేశుడు, సుందర్ కళాకార్ గణపతి, పగిడీ గణేశ్.. ఇలా మరెన్నో భిన్నమైన వినాయకుల విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ తరహా చిన్న, చిన్న తేడాలతో ఒకే పీస్ ఉండేటువంటి ప్రతిమలను కొనుగోలు చేసేందుకు యువకులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం చాలామంది ఇప్పటికే ఆర్డర్లు కూడా ఇచ్చారు. వినాయక విగ్రహాల ఎంపికలో యువకులు కొత్తగా ఆలోచిస్తున్నారు. గతంలో దాదాపు పదేండ్లలో ఎప్పుడూ కొనుగోలు చేయనటు వంటి విగ్రహాలను తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు ముందస్తుగా నచ్చిన డిజైన్తో ప్రతిమలను తయారు చేయిస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే విగ్రహాలను కొనుగోలు చేసి మండపాల వద్దకు తీసుకొచ్చారు.
ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు
గణపతి మండపాలను పూజలకే పరిమితం చేయకుండా చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీల నిర్వాహకులు సిద్ధమవుతున్నాయి. అన్నదానాలు, లడ్డూ వేలం పాటల రోజుల్లో ఆర్కేస్ట్రా వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ నే.. స్థానికంగా ఉండే చిన్నారులను అందులో భాగస్వాములను చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చిన్నారుల ప్రదర్శనలను చూసేందుకు కుటుంబసభ్యులంతా అక్కడకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక పాటలకు ముందుగానే నృత్యాలను ప్రాక్టీస్ చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రతి కార్యక్రమం సక్సెస్ అయ్యేందుకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధుల సహకారాన్ని కూడా తీసుకుంటున్నారు. కొన్ని ఉత్సవ కమిటీల నిర్వాహకులు సొం తంగా కొంచెం డబ్బును వేసుకుని కార్యక్రమాలను నిర్వహించేందుకు ముందుకొస్తున్నాయి. మరోవైపు, మండపాల ఏర్పాటులోనూ కొత్తగా ఆలోచిస్తున్నారు. ఖర్చు ఎక్కువైనా ఆకట్టుకునేలా వివిధ డిజైన్లలో ఏర్పాటు చేయిస్తున్నారు.
అసోసియేషన్ సభ్యులమే తలాకొంత వేసుకుని..
మదర్ ఇండియా యూత్ అసోసియేషన్లో 40 మంది మి సభ్యులుగా ఉన్నాం. గతేడాది 18 ఫీట్ల ఎత్తున్న వినాయకుడి విగ్రహాన్ని రూ.86 వేలకు కొనుగోలు చేశాం. అంతా చర్చించుకుని ఈ ఏడాది రూ.లక్షకు 16 ఫీట్ల ప్రతిమ కోసం ఆర్డర్ కూడా ఇచ్చాం. కొంతమంది వద్దే చందాలు వసూలు చేస్తాం. మిగిలినదంతా అసోసియేషన్ సభ్యులమే తలాకొంత వేసుకుంటాం. నిమజ్జనం సమయంలో పెద్దఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. చిన్నారులు, మహిళలు, పెద్దలు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. – ఎల్లంకి నిఖిల్రెడ్డి, పెద్దఅంబర్పేట
అందరం కలిసి కొత్తగా..
వారియర్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. ఈ ఏడాది చవితి ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. చిన్నారులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేసి ఆహ్లాదకర వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది వినాయక ప్రతిమల ధరలు మండిపోతున్నాయి. గతేడాది 12 ఫీట్ల వినాయకుడి విగ్రహాన్ని రూ.27 వేలకు తెచ్చాం. ఈ ఏడాది పది ఫీట్ల వినాయకుడి విగ్రహానికి సైతం రూ.లక్ష చెప్తున్నారు. ఇప్పటికే అందరం కలిసి ధూల్పేట, పెద్దఅంబర్పేట, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో తిరిగి విగ్రహాలను పరిశీలిస్తున్నాం. వ్యాపారాలు లేవంటూ చందాలు సైతం అంతంత మాత్రంగానే వసూలయ్యాయి.
– గడ్డం శ్రీకాంత్, వైఎస్సార్ కాలనీ, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ
ఈ విగ్రహాలు ఇంకెక్కడ లభించవు
ఈ ఏడాది కోల్కతా మోడల్లో మట్టి వినాయకులను తయారు చేయించాం. ఇందుకోసం ప్రత్యేకంగా గంగ మట్టిని తీసుకొచ్చాం. వివిధ ప్రాంతాల నుంచి నాణ్యమైన మట్టిని తెచ్చి.. పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకునేలా గణనాథుల ప్రతిమలను తయారు చేయించాం. కోల్కతా వినాయకులు ఒక్కోటి ఒక్కో తరహాలో ఉంటుంది. ఇక్కడ లభించే ప్రతిమలు నగరంలో ఇంకెక్కడ దొరకవు. అవి కూడా ఒక్కో వినాయకుడి ప్రతిమ ఒక్కో పీస్ మాత్రమే ఉంటుంది. ఒక్కో విగ్రహం ఎత్తు 4 నుంచి 15 ఫీట్ల వరకు ఉంటుంది. వారం నుంచి బుకింగ్ మొదలుపెట్టాం. చాలామంది వస్తున్నారు. మంచి గిరాకీ ఉంది. మా వద్ద 450కిపైగా విగ్రహాలున్నాయి. – పవన్రెడ్డి, పెద్దఅంబర్పేట, విక్రయదారు
నచ్చిన డిజైన్లలో చేయించుకుంటున్నారు
మా వద్ద దాదాపుగా వెయ్యి విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. ఫీటు మొదలు 15 ఫీట్లకుపైగా ఎత్తు విగ్రహాలను తయా రు చేయించాం. కొంతమంది నుంచి ముందే ఆర్డర్లు వచ్చాయి. నచ్చిన డిజైన్లలో వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసుకున్నారు. మా వద్ద ప్రతిమల ధరలు రూ.6 వేల నుంచి రూ.80 వేల వరకు ఉన్నాయి. నిత్యం ఎంతోమంది విగ్రహాలను కొనేందుకు వస్తున్నారు.
– కిశోర్, పెద్దఅంబర్పేట, గణపతి విగ్రహాల విక్రయదారు