ఇబ్రహీంపట్నం, నవంబర్ 11 : ఒక పక్క రాష్ట్రంలో పల్లెలకూ రోడ్ల సౌకర్యం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం మిగతా రాష్ర్టాలకూ ఆదర్శప్రాయంగా నిలుస్తుంటే… మరోపక్క జాతీయ రహదారులు అధ్వానంగా తయారై వాహనదారులకు నిత్య నరకం చూపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే హయత్నగర్ నుంచి కొత్తగూడెం వరకు సుమారు 15 కిలోమీటర్ల పొడవునా ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయి.
దీంతో అనేకమంది ప్రమాదాల బారిన పడుతున్నారు. వర్షం వస్తే వాహనదారుల ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. కనీస మరమ్మతులు కూడా చేపట్టకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఎదురవుతున్నదని స్థానికులు కేంద్రం వైఖరిని దుయ్యబడుతున్నారు. కేంద్రం పాలనకు ఈ జాతీయ రహదారులే నిదర్శనమని, కేంద్రం మాటల్లో తప్ప చేతల్లో చేసిందేమీ లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.