హైదరాబాద్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ): తెలంగాణలో విద్వేషపూరిత ప్రసంగాలు, విద్వేషపూరిత నేరాల నివారణకు ఉద్దేశించిన బిల్లు-2026పై ఏర్పాటుచేసిన శాసనసభ సెలెక్షన్ కమిటీ తొలి సమావేశం శనివారం శాసనసభా భవనంలోని స్పీకర్ చాంబర్లో జరిగింది. సమావేశానికి స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, సెలెక్షన్ కమిటీ చైర్మన్, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్తోపాటు కమిటీ సభ్యులు దానం నాగేందర్, కోవ లక్ష్మి, గవినోళ్ల మధుసూదన్రెడ్డి, తోట లక్ష్మీకాంతరావు, కవ్వంపల్లి సత్యనారాయణ, మామిడాల యశస్విని, కోనేటి మాణిక్రావు, కూనంనేని సాంబశివరావు, అహ్మద్ బిన్ అబ్దుల్ బలాల్ పాల్గొన్నారు.
విద్వేషపూరిత ప్రసంగాలు, నేరాల నివారణకు సంబంధించిన బిల్లును సమగ్రంగా పరిశీలించి, తగిన సిఫార్సులతో కూడిన నివేదికను శాసనసభకు సమర్పించే కీలక బాధ్యతను సభ సెలెక్షన్ కమిటీకి అప్పగించిందని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ చెప్పారు. కమిటీ సభ్యులు నిష్పాక్షికంగా, సమగ్ర అధ్యయనం చేసి, నిర్మాణాత్మక చర్చల ద్వారా సమర్థవంతమైన నివేదికను సిద్ధం చేస్తారనే పూర్తి విశ్వాసం తనకు ఉన్నదని పేరొన్నారు. సమాజానికి ఉపయోగపడేలా, భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలిచే విధంగా సభ్యుల సహకారంతో నిబంధనలు రూపొందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.