చారిత్రక, ఆధునిక మేళవింపుతో విశ్వపథాన పయనిస్తూ.. అంతర్జాతీయ నగరాలతో పోటీపడుతున్న హైదరాబాద్లో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతిష్టాత్మకమైన ఎయిర్పోర్టు మెట్రోకు పునాదిరాయి పడింది. 31 కి.మీ దూరంతో రూ. 6,250 కోట్లతో చేపట్టనున్న రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రో ప్రాజెక్టుకు శుక్రవారం మైండ్స్పేస్ వద్ద సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. భవిష్యత్లో రింగ్ రోడ్డు చుట్టూ మెట్రోను విస్తరిస్తామని ప్రకటించారు. వరల్డ్ గ్రీన్ సిటీతోపాటు, బెస్ట్ లివబుల్ సిటీ అవార్డులను హైదరాబాద్ దక్కించుకోవడం గర్వకారణంగా ఉందని, ఇంకా ఎన్నెన్నో అవార్డులు నగరానికి రావాలని ఆకాంక్షించారు.
– సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ)
‘కాలుష్య రహితమైన ఏకైక రవాణా సదుపాయం మెట్రో. దీన్ని మరింతగా విస్తరించాల్సిన అవసరమున్నది. అందుకే హైదరాబాద్ చుట్టూ మెట్రో రైలు వలయం ఏర్పాటు చేస్తాం. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా గ్రేటర్ చుట్టూ మెట్రో సేవలను విస్తరిస్తాం. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఎయిర్ పోర్టుకు మెట్రో కనెక్టివిటీ రాలేదు. ఈ లోపాన్ని తీర్చేందుకే రూ.6.500 కోట్లతో రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో నిర్మాణం చేపడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఈ ఎక్స్ప్రెస్ మెట్రో ప్రాజెక్టును మూడేండ్లలో విజయవంతంగా పూర్తి చేస్తాం.’ – సీఎం కేసీఆర్
సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ) : అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్లో మరో భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశ్వనగరంగా మారిన హైదరాబాద్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాయదుర్గం మైండ్స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు రూ.6,250 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో కారిడార్ 2.0 నిర్మాణానికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు శుక్రవారం ఉదయం 11.23 గంటలకు శంకుస్థాపన చేశారు. అనంతరం రుత్వికుల వేద మంత్రోచ్ఛరణల నడుమ పూర్ణకుంభ స్వాగతంతో వేదికపైన చండీమాత వద్ద సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మహమూద్ ఆలీ, వేముల ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీలు కే.కేశవరావు, నామా నాగేశ్వర్రావు, రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కేపీ వివేకానంద్, సాయన్న, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, బేతి సుభాష్రెడ్డి, పైలెట్ రోహిత్రెడ్డి, జైపాల్యాదవ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, శంభీపూర్ రాజు, కె.నవీన్కుమార్, పట్నం మహేందర్రెడ్డి, కె.జనార్దన్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, జీఎంఆర్ గ్రూపు చైర్మన్ జీఎం రావు, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీఎంవో అధికారులు భూపాల్రెడ్డి, దేశ్పతి శ్రీనివాస్, కార్పొరేషన్ల చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, రావుల శ్రీధర్రెడ్డి, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కేఎస్ రత్నం, బీసీ కమిషన్ సభ్యులు కిశోర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి హెచ్ఎండీఏ తరఫున రూ.625 కోట్ల చెక్కును సీఎం కేసీఆర్కు అందజేస్తున్న పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, చిత్రంలో మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి, శ్రీనివాస్యాదవ్, మేయర్ విజయలక్ష్మి, ఎంపీలు కేశవరావు, నాగేశ్వర్రావు, రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, కిషన్రెడ్డి తదితరులు