మొయినాబాద్, డిసెంబర్ 18 : హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టడానికి అధికారులు సంసిద్ధమయ్యారు. ఏడాది నుంచి ల్యాండ్ సర్వేలు చేపట్టారు. సంబంధిత భూ బాధితులకు నోటీసులు కూడా జారీ చేశారు. ప్రస్తుతం రోడ్డు పనులకు ఎలాంటి అడ్డంకులు లేని చోట నేషనల్ హైవే అథారిటీ వారు రోడ్డు విస్తరణకు అడ్డంగా వస్తున్న నిర్మాణాలను కూల్చివేసే పనులు ముమ్మరం చేశారు. నాలుగు రోజుల క్రితం మొదలు పెట్టగా ప్రస్తుతం రోడ్డు నిర్మాణంలో అడ్డు వస్తున్న నిర్మాణాలను కూల్చివేయడం వేగవంతం చేశారు.
దుకాణాల సమూదాయాల్లో వ్యాపారాలు చేస్తున్న వ్యాపారులు… నివాసాలు ఉన్న వారు ఖాళీ చేస్తున్నారు. అప్రమత్తమైన వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను ఖాళీ చేస్తున్నారు. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం 2018లో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. రోడ్డు మధ్య నుంచి ఇరువైపులా ఎటూ 30 మీటర్ల వెడల్పుతో విస్తరణ చేయాలని నేషనల్ హైవే ఆఫ్ అథారిటీ ప్రణాళికలు రూపొందించింది. దాని ప్రకారం రోడ్డు పనులు చేపట్టడానికి అధికారులు రోడ్డులో అడ్డుగా ఉన్న నిర్మాణాలను కూల్చివేసే పనుల్లో నిమగ్నం అయ్యారు.
హిమాయత్నగర్ రెవెన్యూలో ప్రహరీ కూల్చివేత
రోడ్డు విస్తరణ కోసం 2018లో నోటిఫికేషన్..
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి రోడ్డు విస్తరణ చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం 2018లో నోటిఫికేషన్ జారీ చేసింది. రోడ్డు వెడల్పు కోసం అవసరమైన భూములను అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం నాటి నుంచి రోడ్డు విస్తరణ కోసం భూ సేకరణ చేపట్టింది. భూములు కోల్పోతున్న భూ బాధితులను గుర్తించి అందుకు సంబంధించి బాధితుల నుంచి పత్రాలను పూర్తిగా సేకరించింది. భూములు కోల్పోతున్న బాధితుల బ్యాంక్ ఖాతాలో పరిహారం జమ చేసింది.
నాలుగేండ్లుగా ట్రాఫిక్ ఇబ్బందులు
హైదరాబాద్ శివారులో ఉన్న హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి నాలుగేండ్లుగా ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో ఇంజినీరింగ్ కళాశాలలు, మెడికల్ కళాశాలలు, ఇంటర్నేషనల్ లెవల్ పాఠశాలలు ఉండటంతో ఈ రహదారిలో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో అనంతపద్మనాభ స్వామి ఆలయం, కోట్పల్లి ప్రాజెక్టు, అనంతగిరి హిల్స్, మొయినాబాద్లో చిలుకూరు బాలాజీ ఆలయం, మృగవని నేషనల్ పార్కు ఉండటంతో సెలవు దినాల్లో ఈ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సమస్యల పరిష్కారం కోసం రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలకు వినతి పత్రాలు వెళ్లాయి. స్పందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టాయి. రోడ్డు పనులు షురూ చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పడుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అజీజ్నగర్ చౌరస్తా నుంచి పనులు షురూ
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు అజీజ్నగర్ నుంచి మొదలు పెట్టారు. 2018 కంటే ముందు నిర్మాణాలు చేపట్టిన నిర్మాణాలకు మాత్రమే పరిహారం చెల్లిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. నోటిఫికేషన్ వెలుబడిన తరువాత చేపట్టిన నిర్మాణాలకు పరిహారం మాత్రం అందదని అధికారులు పేర్కొన్నారు. ప్రధానంగా హిమాయత్నగర్ రెవెన్యూ పరిధిలో ఎక్కువ శాతం నిర్మాణాలు ఉన్నాయి. రహదారికి ఇరువైపులా హిమాయత్నగర్ రెవెన్యూ భూములు ఉండటంతో వ్యాపార కేంద్రాలు నాలుగేండ్లలో చాలా వెలిశాయి. ఔటర్ రింగ్ రోడ్డుకు 5కిలో మీటర్ల దూరంలో హిమాయత్నగర్ రెవెన్యూ ఉండటంతో హోటల్ బిజినెస్ బాగా పెరిగింది. వ్యాపార దుకాణ సమూదాయాలు రోడ్డుకు ఇరువైపులా ఉండటంతో రహదారి విస్తరణలో పూర్తిగా పోతున్నాయి. మొయినాబాద్ మండల కేంద్రం కంటే అధికంగా హిమాయత్నగర్ చౌరస్తా నుంచి అజీజ్నగర్ చౌరస్తా వరకు హోటల్ వ్యాపారం చాలా విస్తరించింది. దీంతో ఈ ప్రాంతంలో ప్రతి నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులతో స్థానికులు తీవ్ర బెంబేలెత్తారు. పనులు మొదలు కావడంతో ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయని స్థానికులు పేర్కొంటున్నారు.
రహదారి విస్తరణతో మరింత అభివృద్ధి
రహదారి విస్తరణ పనులు పూర్తి అయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. రోడ్డు విస్తరణకు సంబంధించి రాష్ట్ర ప్రభు త్వం భూ సేకరణ వేగవం తం చేసింది. భూ బాధితుల కు పరిహారం కూడా 80 శా తం వరకు ప్రభుత్వం చెల్లించింది. జిల్లా మంత్రి, ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు కృషి చాలా ఉంది. రోడ్డు పనులు పూర్తి అయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
– కాలె శ్రీకాంత్, జడ్పీటీసీ, మొయినాబాద్