జిల్లాలోని గనుల్లో ఖనిజాల ఉత్పత్తులు పెరగడంతో అదే రీతిలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నది. జిల్లావ్యాప్తంగా క్వార్జ్, గ్రానైట్, కంకర పరిశ్రమలు 97 వరకు ఉన్నాయి. ఇక్కడి ఖనిజాలకు దేశ, విదేశాల్లో మస్తు డిమాండ్ ఉండడంతో కొన్నేండ్లుగా జిల్లా నుంచి గనులు, భూగర్భ శాఖకు భారీగా ఆదాయం సమకూరుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యం రూ.92 కోట్లు కాగా.. ఆగస్టు నెలాఖరు వరకు రూ.32.20కోట్ల్లు సమకూర్చుకోవాల్సి ఉన్నది. అయితే అనూహ్యంగా రూ.50కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇంకా ఎనిమిది నెలల సమయం ఉండగానే ఇంత మొత్తం ఆదాయం రావడంతో ఈ ఏడాది కూడా నిర్ధేశిత లక్ష్యాన్ని సునాయసంగా చేరుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు.
-రంగారెడ్డి సెప్టెంబర్ 20(నమస్తే తెలంగాణ)
ఓ గ్రానైట్ పరిశ్రమ ఏర్పాటుకు మామూళ్లు ఇచ్చుకున్నప్పటికీ ఏడాది కాలం పట్టేది. అయినా అనుమతి వస్తుందన్న గ్యారంటీ లేదు.
ఎంత భారీ గ్రానైట్ పరిశ్రమ ఏర్పాటుకైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరి. నెలల వ్యవధిలోనే అనుమతులు వచ్చేస్తున్నాయి.
రంగారెడ్డి, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలోని గనులు, ఖనిజాలు.. సంబంధిత శాఖకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇక్కడి ఖనిజాలకు దేశ, విదేశాల్లో ఉన్న డిమాండ్తో గడిచిన కొన్నేండ్లు గా గనులు, భూగర్భ శాఖకు భారీగా ఆదాయం సమకూరుతున్నది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి ఇంకా ఎనిమిది నెలల సమయం ఉండగానే రూ.50కోట్ల ఆదాయా న్ని సమకూర్చుకుని సగానికి పైగా లక్ష్యాన్ని గనులు, భూగర్భ శాఖ చేరుకున్నది. జిల్లా వ్యాప్తంగా క్వార్జ్, గ్రానైట్, కంకర పరిశ్రమలు 97 వరకు నడుస్తున్నాయి. నిర్మాణరంగం పురోగమిస్తున్నదనడానికి ఈ పెరిగిన ఆదాయమే నిదర్శనమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గనులు, భూగర్భ శాఖలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సైతం ఆదాయ వృద్ధికి దోహదపడుతున్నాయి.
ఒకప్పుడు గనులు, భూగర్భ శాఖ అవినీతికి ఆలవాలంగా ఉండేది. అధికారులు లీజుదారులతో కుమ్మక్కై పరోక్షంగా అక్రమాలను ప్రోత్సహించడంతో ప్రభుత్వ ఆదాయానికి సైతం భారీగా గండి పడేది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్ర భుత్వం ఆ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసింది. పెద్ద ఎత్తున తీసుకొచ్చిన సంస్కరణలు, మార్పులు, పారదర్శక విధానాలు ఈ శాఖ ఆదాయం వృద్ధికి దోహదపడ్డాయి. అనుమతులు, లీజుల రెన్యూవల్కు ఆన్లైన్ విధానాన్ని ప్రభు త్వం అమల్లోకి తెచ్చింది. అనుమతులు ఒక చోట పొంది మరో చోట తవ్వకాలు జరపడం.. పొందిన అనుమతుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఖనిజాన్ని వెలికితీయడం తదిత ర ఉదంతాలకు చెక్ పెట్టేందుకు డీజీపీఎస్ ట్రాక్ సర్వేను అమల్లోకి తెచ్చింది. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గనుల తవ్వకాలు, తరలింపుపై పక్కా నిఘా ఉండి అక్రమాలు తగ్గాయి. దీంతోపాటు గ్రానైట్ రవాణాకు సంబంధించి తనిఖీలు పెరగడంతో అక్రమ రవాణాకు సైతం చా లా వరకు అడ్డుకట్ట పడింది. ఖనిజాల అక్రమ రవాణాకు సంబంధించి ఈ ఏడాదిలో ఐదు నెలల కాలంలోనే నమోదైన కేసుల ద్వారా రూ.35.44లక్షలను జరిమానాల రూపంలో వసూలు అయింది.
గనులు, భూగర్భ శాఖ ఖజానాకు భారీగా వచ్చి చేరుతున్న ఆదాయం జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సైతం దోహదపడుతున్నది. గనుల యజమానులు ఏటా ప్రభుత్వానికి చె ల్లించే సీనరేజ్ ఛార్జీపై 30 శాతాన్ని ‘జిల్లా ఖనిజ సంక్షేమ నిధి’కి జమ చేస్తూ వస్తున్నారు. ఈ నిధులతో మైనింగ్ ప్ర భావిత ప్రాంతాల సమగ్రాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు చర్యలు చేపడుతున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా ఖనిజ కమిటీ సభ్యుల సూచనల మేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ నిధుల కేటాయింపు జరుగుతున్నది. జిల్లాలో విద్య, వైద్యం, గ్రామీణ రోడ్లు, స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన కార్యక్రమాల అమలుకు ఈ నిధులను వెచ్చిస్తున్నారు. క్వారీ లీజుల ద్వారా ఇప్పటి వరకు గనులు, భూగర్భ శాఖ జిల్లా ‘ఖనిజ నిధి’కి రూ.111.75కోట్ల ఆదాయాన్ని సమకూర్చింది.
గత రెండేళ్లకాలంలో భారీగా ఆదాయాన్ని పొందు తూ జిల్లా గనుల శాఖ ఆదర్శంగా నిలుస్తున్నది. జిల్లాలోని గనుల్లో ఖనిజాల ఉత్పత్తులు పెరగడంతో అదే రీతిలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 109 వరకు క్వార్జ్, గ్రానైట్, కంకర పరిశ్రమలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం 97 మాత్రమే పని చేస్తున్నాయి. రాయి, కంకర పరిశ్రమలు 51, బ్లాక్, కలర్ గ్రానైట్ పరిశ్రమలు 15, పలుగు రాయి, ఫెల్డ్ స్పార్ పరిశ్రమలు 43 వరకు వినియోగంలో ఉన్నాయి. చేవెళ్లలో హస్తేపూర్, అనంతవరంలో రెండు లేటరైట్ పరిశ్రమలు నడుస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం లీజు డబ్బులను ఆయా పరిశ్రమల యజమానుల నుంచి గనులు, భూగర్భ శాఖ వసూలు చేస్తున్నది. 2022-23 సంవత్సరంలో రూ.154.65కోట్ల భారీ ఆదాయం వచ్చింది. అలాగే.. 2023-24 ఏడాదికి రూ.92కోట్ల లక్ష్యాన్ని విధించుకోగా.. ఏప్రిల్-ఆగస్టు మాసం నాటికి రూ.32.20కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సి ఉంది. అయితే అనూహ్యంగా రూ.50కోట్ల ఆదాయం వచ్చింది. ఇంకా 8 నెలల సమయం ఉండగానే ఇంత మొత్తం ఆదాయం రావడంతో ఈ ఏడాది కూడా నిర్దేశిత లక్ష్యాన్ని సునాయసంగా చేరుకుంటామని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో వృద్ధిరేటు తిరోగమనంలో ఉండగా.. తెలంగాణ లో ఆదాయ వృద్ధి కనిపిస్తున్న ది. తెలంగాణ ప్రభుత్వం గనులు, భూగర్భ శాఖలో భారీ సంస్కరణలు తీసుకొచ్చింది. అనుమతులు, రెన్యూవల్కు ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పారదర్శకతతో జిల్లాలో గనుల లీజు రూపంలో పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతున్నది. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాల్లోనూ గనుల లీజు రూపంలో వస్తు న్న నిధులు కీలకపాత్ర పోషిస్తున్నాయి.
– ప్రవీణ్ రెడ్డి, సహాయ సంచాలకులు, గనులు, భూగర్భ శాఖ, రంగారెడ్డి జిల్లా