చేవెళ్ల టౌన్, డిసెంబర్ 13 : మండలంలో ప్రతి ఏడాది పత్తి సాగు గణనీయంగా పెరుగుతున్నది. ఈ ఏడాది 8076 ఎకరాలకు పైగా పత్తి పంట సాగు చేశారు. కానీ పత్తి సాగులో జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడి వచ్చి లాభాలు పొందవచ్చు. వరికన్నా పత్తి సాగే మేలని మండల రైతులు పేర్కొంటున్నారు. నీటి వినియోగం తక్కువే అవసరముంటుందని, చేనులో కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే పెట్టుబడి ఖర్చు కూడా తక్కువగానే వస్తుందని తెలుపుతున్నారు.
పత్తి సాగులో జాగ్రత్తలు..
పంట చేతికొచ్చాక..
పత్తి బాగా విప్పుకున్న కాయ నుంచి మాత్రమే పత్తిని తీయాలి. కొద్దిగా విప్పిన కాయ నుంచి పత్తి తీయకూడదు. పత్తి తీసే సమయంలో ఆకులు చేతికి అంటకుండా జాగ్రత్త పడాలి. తీసిన పత్తిని నీడలో ఆరబెట్టి గాలి తగిలేలా నిల్వ చేసుకోవాలి. తేమ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ వేడి ఉన్నప్పుడు పత్తిని తీస్తే గుల్లల వద్ద తొడిమెలు, ఆకులు పత్తికి అంటుకుంటాయి. పత్తి సాగు చేసే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో తీసే సమయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తే అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
సలహాలు, సూచనలు పాటించండి..
పత్తి రైతులు సాగు మొదలు పత్తి తీసే సమయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుత సమయంలో మంచు అధికంగా కురుస్తున్నది. మంచు తగ్గిన తర్వాత పత్తి తీయాలి. అధిక వేడి ఉన్నప్పుడు పత్తిని తీసినట్లయితే వెంటనే నీడలో వేయాలి. ఇలా చేస్తే తేమ తగ్గి పత్తి నాణ్యతగా ఉంటుంది. కాయ విప్పిన 5 నుంచి 6 రోజుల్లో పత్తిని తీయాలి. లేక పోతే తేమ ఎక్కువై సూటిమోల్డ్ వచ్చే అవకాశం ఉన్నది. రైతులు తప్పని సరిగా వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తే అధిక లాభాలు సాధిస్తారు.