రంగారెడ్డి, మే 2 (నమస్తే తెలంగాణ): పోలింగ్ కేంద్రాలకు రాలేని పరిస్థితిలో ఉన్న వృ ద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకోలేక పోతుండడం.. పోలింగ్ శాతం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటును కల్పించింది.
జిల్లాలో ఈనెల 3 నుంచి 8 వరకు చేపట్టనున్న హోం ఓటింగ్కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 961 మంది వృద్ధ్దులు, 488 మంది దివ్యాంగులు, ఎస్సెన్షియల్ సర్వీసెస్కు చెందిన 39 మంది ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 69 బృందాలను ఏర్పాటు చేశారు.
ప్రతి ఎన్నికలోనూ పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటు న్నా ఆశించిన స్థాయిలో మాత్రం పోలింగ్ నమోదు కావడంలేదు. ఇందుకు చాలా మంది వృద్ధులు, దివ్యాంగులు ఓటింగ్కు దూరంగా ఉండడం ఓ కారణంగా చెప్పొచ్చు. అంతే కాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు వీల్చైర్లతోపాటు ఇతర వసతులు కల్పిస్తు న్నా వృద్ధులు, దివ్యాంగులను పోలింగ్ కేంద్రాల వరకు తీసుకురావడమే పెద్ద సమస్యగా మారుతున్నది. ఈ పరిస్థితుల్లో చాలామంది ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నారు.
ఈ సమస్యను అధిగమించేందుకు ఎన్నికల సంఘం హోం ఓటింగ్కు అవకాశం కల్పించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏండ్ల వారికి అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల్లో వయో పరిమితిని 85 ఏండ్లకు పెంచింది. అలాగే 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులు సైతం ఇంటి నుంచే ఓటు వేసేలా ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు అధికారులు ఓటరు జాబితాననుసరించి జిల్లాలో 85 ఏండ్లకు పైబడిన వారిని, దివ్యాంగులను గుర్తించారు. అధికారులు గుర్తించిన ప్రకారం.. జిల్లాలో 85 ఏండ్లు దాటినవారు మొత్తం 19,350 మంది ఉన్నట్లు తేలింది. ఇందులో పురుషులు 8,729 మంది ఉండగా స్త్రీలు 10,619మంది, థర్డ్ జెండర్స్ ఇద్దరు ఉన్నారు.
అలాగే 40 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులు జిల్లాలో 45,567 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇందులో పురుషులు 24,861మంది, స్త్రీలు 20,701మంది, థర్డ్ జెండర్స్ ఐదుగురున్నారు. పోస్టల్ బ్యాలెట్ మాదిరిగానే హోంఓటింగ్కు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండడంతో ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇం దుకు సంబంధించి బీఎల్వోలు అర్హులైన వారందరికీ ఫారం 12-డీని పంపిణీ చేశారు. అయితే హోంఓటింగ్కు కేవలం 1,449 మంది వృద్ధులు, దివ్యాంగులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మంచానికే పరిమితమైన వారు..అచేతన స్థితిలో ఉన్నవారు మా త్రమే హోం ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు చెబుతున్నారు. చాలా మంది పోలింగ్ కేంద్రాలకొచ్చి ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం వల్ల హోం ఓటింగ్ ఓటర్ల సంఖ్య తక్కువగా నమోదైనట్లు వారు పేర్కొంటున్నారు.
జిల్లాలో హోం ఓటింగ్ ప్రక్రియ నిర్వహణకు ఎన్నికల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అర్హత పొందిన ఓటర్ల ఇంటింటికెళ్లి ఎన్నికల నియమావళికి లోబడి ఓటు వేసేలా చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలోని 69 రూట్లలో ప్రత్యేకంగా 69 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో సూక్ష్మ పరిశీలకుడు, సెక్టోరల్, పోలింగ్ అధికారులు, పోలీస్, రూట్ ఆఫీసర్లు, వీడియోగ్రాఫర్ ఉంటారు.
ఏ రోజు ఓటు వేయాలో ముందుగానే నిర్ణయించిన తేదీన సంబంధిత అధికారుల బృందం ఇంటింటికెళ్లి హోం ఓటింగ్ ప్రక్రియను చేపడుతుంది. పోలింగ్ బూత్లో మాదిరిగానే బ్యాలెట్ పేపర్పై రహస్యంగా ఓటు వేసేలా ఏర్పాట్లు చేసి ఆ ఓటును సీల్ చేసిన తర్వాత స్థానిక తహసీల్దార్ కార్యాలయం ద్వారా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి పంపిస్తారు. ఈ ప్రక్రియ అంతా వీడియో తీస్తారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి హోం ఓటింగ్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.