షాద్నగర్, నవంబర్18 : దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ సంక్షేమానికి నిధులను ఖర్చు చేస్తున్నారని హోం మంత్రి మహమూద్అలీ అన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే మైనార్టీ సంక్షేమం సాధ్యమైందనే విషయాన్ని ముస్లిం సోదరులు గ్రహించాలన్నారు. శనివారం రాత్రి షాద్నగర్లో నిర్వహించిన ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి వై.అంజయ్యయాదవ్తో కలిసి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ఏనాడు కూడా ముస్లింల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, వారి పాలనలో పేదరికం పెరిగిందే తప్పా మన బతుకులు మారలేదని చెప్పారు. ముస్లింలు అంటే కాంగ్రెస్ అని చెప్పుకునే నాయకులు.. ముస్లింలకు ఏమి చేశారో చెప్పాలన్నారు. కేవలం ముస్లింల ఓట్ల కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది తప్పా, మన బాగు కోసం కాదనే విషయాన్ని తెలంగాణ మైనార్టీలు గుర్తించాలని సూచించారు.
కాంగ్రెస్ పాలన ఉందంటే హైదరాబాద్ వంటి నగరాల్లో అల్లర్లను సృష్టించి ప్రజల మధ్య ఘర్షణలను ప్రోత్సహించి రాజకీయాలు చేసేవారని.. నేడు ఆ పరిస్థితి లేదని.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మైనార్టీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొనారు. అన్ని మతాలకు, కులాలకు దీటుగా అభివృద్ధి సంక్షేమ నిధులను కేటాయిస్తూ ముస్లింల ఎదుగుదలకు కృషిచేస్తున్నారన్నారు. మైనార్టీల కోసం గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కిందని, ప్రభుత్వం విదేశాల్లో చదివే విద్యార్థులకు రూ.20 లక్షల ఆర్థిక సహాయం చేస్తుందని వివరించారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధితో రాణించేందుకు ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ నాయకుల మోసపు మాటలను పట్టించుకోవద్దని కోరారు.
ముస్లిం మైనార్టీలకు అన్ని విధాల అండగా ఉంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ అన్నారు. ముస్లింలను ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. షాద్నగర్ నియోజకవర్గంలో బాలికల మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాల ఏర్పాటుతో పాటు ఈద్గా అభివృద్ధికి రూ.43 లక్షల నిధులను వెచ్చించామని పేర్కొన్నారు. షాద్నగర్ షాదీ ఖానా నిర్మాణానికి రూ.50 లక్షలతోపాటు చౌదరిగూడ, నిర్దవెల్లి, కొందుర్గులలో నూతనంగా షాదీఖానాలను నిర్మిస్తున్నామని చెప్పారు. ఆయా గ్రామాల్లో శ్మశాన వాటికలకు ప్రహరీల నిర్మాణానికి నిధులను వెచ్చించామని చెప్పారు.
అర్హత కలిగిన ప్రతి యువతి కుటుంబానికి షాదీముబారక్, మహిళలు, వితంతువులు, వృద్ధులకు ఆసరా పింఛన్లు, విద్యార్థులకు ఉపకార వేతనాలను అందించామని వివరించారు. అభివృద్ధి చేసిన పార్టీని ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే కోరారు. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న హోం మంత్రి మహమూద్అలీని ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీవుల్లాఖాన్, తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజన్, బీఆర్ఎస్ పోలిట్ బ్యూరో మాజీ సభ్యుడు సయ్యద్ ఇబ్రహీం, ఎంపీపీలు ఖాజా ఇద్రీస్, వై.రవీందర్యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సయ్యద్ సాదిక్, కౌన్సిలర్లు సర్వర్ పాషా, మహ్మద్ గౌస్, కో ఆప్షన్ సభ్యుడు గౌస్ జానీ, మోబీన్ ఘోరీ, ఎజాజ్ అడ్డు, అస్రఫ్, షబ్బీర్లాలా, ఉస్మాన్, సిరాజ్, జమాల్ఖాన్, ఆసిఫ్ ఉన్నారు.