ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 6 : ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురిసి, భూగర్భజలాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో రైతులు ఒకేరకం పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఒకేరకమైన పంటలను సాగుచేయటం వలన భూమిలోని సారం తగ్గిపోవటంతో పాటు క్రిమికీటకాలు ఇంకా వృద్ధి చెందే అవకాశమున్నందున రైతులు ఒకేరకమైన పంటలను సాగుచేయటం విధానానికి స్వస్తి చెప్పి పంటల మార్పిడి విధానాన్ని చేపట్టాలని కృషి విజ్ఞానకేంద్రం వ్యవసాయశాస్త్రవేత్త శ్రీకృష్ణ తెలుపుతున్నారు.
ఒకేరకమైన పంటలను సాగుచేయటం వల్ల పొలాల్లో భూసారం తగ్గుతుంది. రోగాలను కలిగించే పురుగుల సంఖ్య బాగా పెరిగి దిగుబడి తగ్గుతున్నది. పంటల మార్పిడి వల్ల భూమిలోని పోషకాలు సమృద్ధిగా అందుతాయి. పంటల మార్పిడితో కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం..
పంటలు సాగుచేయాల్సిన విధానం..
పంటమార్పిడితో దిగుబడి
రైతులు ఒకేరకమైన పంటలు సాగుచేయడం ద్వారా ఆ పంట మొక్కలకు అవసరమైన పోషకాలు తక్కువవుతాయి. రోగకారక పురుగుల ఉధృతి పెరిగి దిగుబడి తగ్గుతుంది. వరుసగా ఒకే పంటను కాకుండా వివిధ రకాల పంటల సాగుతో పురుగుల జీవిత చక్రాన్ని నిలిపివేయవచ్చు. దాంతో రైతులు మంచి లాభాలను పొందగలుగుతారు. రైతులు ఒకే రకమైన పంటల సాగుకు పూర్తిగా స్వస్తి చెప్పి పంటల మార్పిడి విధానానికి శ్రీకారం చుట్టడం ద్వారా మంచి లాభాలు గడించే వీలుంటుంది.
– శ్రీకృష్ణ, కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త