వికారాబాద్/మర్పల్లి, మార్చి 16 : మర్పల్లి మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో గురువారం వడగండ్ల వర్షం కురిసింది. రోడ్లు, ఇండ్లపై వడగండ్లు పడడంతో తెల్లని మంచుతో కప్పుకుపోయినట్లు, విదేశాల్లో ఉన్న మాదిరిగా ప్రజలకు ఆనందాన్ని కలిగించాయి. వర్షం తగ్గిన వెంటనే ప్రజలు వడగండ్లను చూస్తూ సంతోషం వ్యక్తం చేశారు. మర్పల్లి, మోమిన్పేట మండలాల్లోని పలు గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. ఏకధాటిగా అర గంట నుంచి గంట వరకు పడడటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువ ఉండి.. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. వడగండ్ల వర్షంతో ప్రజలు ఒక పక్క భయం, మరో పక్క ఆనందంలో ఉన్నారు. మర్పల్లి నుంచి మోమిన్పట వెళ్లే ప్రధాన రహదారి మంచుతో కప్పబడిన విధంగా మారిపోయింది. ఎటు చూసినా తెల్లని మంచు కనిపించడంతో ప్రజలు విదేశాల్లో ఉన్న అనుభూతి చెందారు. లేకలేక పడిన వడగండ్లను మర్పల్లివాసులు గంపల్లోకి ఎత్తి వింతగా చూశారు. కోట్మర్పల్లిలో పలువురి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వడగండ్లతో పంటలు పాడయ్యాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పలు పంట పొలాలను జడ్పీటీసీ మధుకర్, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈదురు గాలులు సైతం వీయడంతో పలు చోట్ల కాతకొచ్చిన మామిడి కాయలు సైతం నేలరాలడంతో రైతులు దిగాలు చెందుతున్నారు.
మోమిన్పేట : మోమిన్పేటతోపాటు మండల పరిధిలోని ఎన్కతల, టేకులపల్లి, మొరంగపల్లి, కేసారం, సయ్యద్ అలీపూర్ తదితర గ్రామాల్లో గురువారం ఉరుములు, మెరుపులతో వడగండ్ల వాన కురిసింది. ఎన్కతలలో చిలుక వాగు పైనుంచి ప్రవహించింది. మండల పరిధిలో కూరగాయ పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేసున్నారు. సయ్యద్ అలీపూర్లో వ్యవసాయ కూలీ పనులకు వెళ్లిన లక్ష్మమ్మ, మాణెమ్మ, బిచ్చిరెడ్డిలకు వడగండ్ల దెబ్బలు తగలడంతో మోమిన్పేట ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం గ్రామస్తులు తరలించారు. సుబ్రమణ్యం, చంద్రయ్య, సాయిలు, బిచ్చయ్య, శ్రీనివాస్ తదితర 10 మంది ఇండ్ల పైకప్పు రేకులకు రంధ్రాలు ఏర్పడ్డాయి. 400 ఎకరాల్లో కూరగాయ పంటలు, మొక్కజొన్న, గోధుమ, జొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేసున్నారు. పలువురి వాహనాలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులకు, ఇండ్ల యజమానులకు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందించాలని సర్పంచ్ సత్యనారాయణరెడ్డి కోరారు. గ్రామంలో రూ.1.60లక్షల విలువైన సీసీ కెమెరాలు ధ్వంసమయ్యాయని సర్పంచ్ వాపోయారు.
యాచారం : మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రయాణికులు, ప్రజలు ఇబ్బందులెదుర్కొన్నారు. ముఖ్యంగా మండలంలోని మొండిగౌరెల్లి గ్రామంలో వడగండ్ల వర్షం కురిసింది. దీంతో పుదీనా, కొత్తిమీర, కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు రైతులు వాపోయారు. ప్రజలు ఆగమాగమయ్యారు. మంథన్గౌరెల్లి గ్రామంలో వడగండ్లతో సుమారు 50కి పైగా పెంకుటిండ్లు దెబ్బతిన్నాయి. ఇంటి పైకప్పు రేకులు పగిలిపోయాయి. ఇండ్లతోపాటు పంటలకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మండల కేంద్రంలో కురిసిన వర్షానికి రోడ్లపై నీరు ఏరులై పారగా, డ్రైనేజీ పొంగిపొర్లింది. మల్కీజ్గూడ వద్ద నిర్మిస్తున్న కల్వర్టు పనులు నిర్మాణంలో ఉండటంతో పొలంలో నుంచి తీసిన రోడ్డు గుండా ప్రయాణించిన ప్రయాణికుల బైకులు అదుపుతప్పడంతో కిందపడి గాయాలపాలయ్యారు. మంథన్గౌరెల్లిలో ఇండ్లు దెబ్బతినడంతో పరిశీలించేందుకు ఎమ్మెల్యే మంచిరెడ్డి శుక్రవారం రానున్నట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్ తెలిపారు.
మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి శుక్రవారం వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో గురువారం వడగండ్ల వర్షం కురిసింది. వర్షానికి రెండు మండలాల్లోని 13 గ్రామాల్లో మామిడి, ఉల్లిగడ్డ, బొప్పాయి వంటి ఉద్యాన పంటలు, మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి రెండు మండలాల్లో పర్యటించి పంటలకు జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి రైతులను ఓదార్చనున్నారు.