ఆదిబట్ల, ఏప్రిల్ 19 : భూములు దక్కేవరకు పోరాటాన్ని ఆపొద్దని.. కాసుబాగు భూబాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అభయమిచ్చారు. ముఖ్యమంత్రి అండతో రెవెన్యూ మంత్రి పొంగులేటి రెచ్చిపోయి ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నాడని మండిపడ్డారు. ఆదివారం ఆమె నాదర్గుల్ ప్రాంతంలోని సర్వేనంబర్ 613లోని 375 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురికావడంతో ఆ భూముల్లో పర్యటించి.. ధర్నా చేస్తున్న రైతులతో మాట్లాడారు. కాసుబాగ్ శివరాజు బహదూర్ భూముల విషయంలో కొన్నేండ్లుగా భూపోరాటం సాగుతున్నదన్నారు. ఆ భూముల్లో రైతులతో కలిసి పర్యటించి అక్కడ ఎండిన పంటలు, వ్యవసాయం కోసం ఉపయోగించిన బోర్లను అందులో కబ్జాకు గురైన కుంటను పరిశీలించారు.
చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఈ అంశం ప్రస్తావనకు రాగా, అనంతరం మాజీ సీఎం వైఎస్సార్ హయాంలో ఈ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించారని గుర్తు చేశారు. హైకోర్టు సింగిల్బెంచ్, డబుల్ బెంచ్ రెండూ ఈ భూములు ప్రభుత్వ భూములేనని చెపాయని.. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో నడుస్తున్నదని.. వచ్చే నెల 5న ఇయరింగ్ ఉందన్నారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన కోర్టులు కూడా ప్రభుత్వ ఆధీనంలో బందీలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ భూములను కొందరు కబ్జా చేస్తున్నా పట్టించుకునేవారు లేరన్నారు. నాదర్గుల్ ప్రాం తంలోని సుమారు 375 ఎకరాల ప్రభుత్వ భూమి 600 మంది రైతులు సాగు చేసుకుని జీవిస్తున్నారని.. అన్నదాతలను వారి భూముల్లోకి వెళ్లనివ్వకుండా సెక్యూరిటీని ఏర్పాటు చేసి మరీ అడ్డుకోవడం దారుణమన్నారు. రెవెన్యూ మంత్రి మీడియా సమావేశంలో ఈ భూములు ప్రభుత్వనివేనని ప్రకటించినా చర్యలు తీసుకోక పోవడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంపై బీఆర్ఎస్ నాయకులు అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందించినా చర్యలు తీసుకోకపోవడంపై ఆమె మండి పడ్డారు.

ఇదేనా.. ప్రజాపాలన
రైతులు, ప్రభుత్వ భూములను కబ్జా చేయడమేనా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన అని సబితారెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అక్రమంగా భూముల చుట్టూ ఏర్పాటు చేసిన రేకులను తొలగించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ అండగా ఉంటుంది
భూములు దక్కే వరకు మీ పోరాటాన్ని కొనసాగించాలని, బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని సబితారెడ్డి తెలిపారు. న్యాయ, చట్టపరంగా పార్టీ అండగా ఉంటుందని రైతులకు భరోసా కల్పించారు. మీ మధ్య గ్రూపులు ఏర్పాటు చేసి మీమ్మల్ని విడదీసే యత్నాలు జరుగుతున్నాయని.. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండాలన్నారు. ఈ విషయం బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్,హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లి.. అండగా ఉంటామన్నారు.