హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఆయనో విద్యావేత్త. ప్రజాప్రతినిధి కూడా.. ఇంకా చెప్పాలంటే పారాచూట్ లీడర్. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. రాత్రికి రాత్రే ఎమ్మెల్యే అయిపోవాలి అన్నట్లుగా ఆయన వ్యవహారముంటుంది. ఈ తొందరపాటుతోనే పార్టీ మారారు. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ బీ ఫారం సంపాదించారు. కానీ ఆయనకంటూ కేడర్ లేదు. లీడర్లు ఆయన వెంటరావడం లేదు. ఇంకేం కాలేజీ సిబ్బందిని ఆయన ప్రచారానికి పురమాయించారు. తమ ఇంజినీరింగ్ కాలేజీ స్టాఫ్కు కాంగ్రెస్ కండువాలు వేసి ప్రచారంలోకి దింపారు. ఇంతకీ ఆయనెవరనుకుంటున్నారా..! ఆయనే కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి.
ఇంతకాలం బీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా కొనసాగిన ఆయన రాత్రికి రాత్రే కాంగ్రెస్లో చేరి పార్టీ టికెట్ను దక్కించుకున్నారు. వాస్తవానికి ఈ టికెట్ను నారాయణరెడ్డితో పాటు మరికొంత మంది నేతలు ఆశించారు. టికెట్ను నారాయణరెడ్డి ఎగరేసుకుపోవడంతో వారి కేడర్ ప్రచారానికి మోహం చాటేస్తున్నారు. ప్రచారానికి పార్టీ కేడర్ ముందుకురాకపోవడం, పరువుపోయే అవకాశముండటంతో హయత్నగర్లోని తమ ఇంజినీరింగ్ కాలేజీ లెక్చరర్లు, స్టాఫ్తో ప్రచారం చేయిస్తున్నారు. తమ విద్యాసంస్థల్లో పనిచేస్తున్నవారిని ప్రచారానికి వాడేస్తున్నారు. ఏకంగా పాఠాలు బంద్ పెట్టించి కల్వకుర్తిలో ఎన్నిక ప్రచారానికి వినియోగించుకుంటున్నారు. ఆయన పోరుపడలేక అధ్యాపకులు కాంగ్రెస్ కండువాలు ధరించి ఆ పార్టీకి ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఇలా చేయడం నిబంధనలకు విరుద్దం. కానీ జీతాలిస్తున్నామన్న కారణంతో లెక్చరర్లను స్వకార్యానికి వాడుకుంటున్నారని అధ్యాపక సంఘాలు మండిపడుతున్నాయి. జేఎన్టీయూ అధికారుల దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కల్వకుర్తిలో గల ఈ వింత పరిస్థితిని చూసి, జనం ముక్కునవేలేసుకుంటున్నారట.