షాద్నగర్, డిసెంబర్ 30 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం పథకం ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. నాలుగేండ్ల క్రితం నాటిన మొక్కలు వృక్షాలుగా మారి గ్రామాలకు స్వాగత తోరణాలుగా మారాయి. గ్రామాల ప్రజలు, వాహనదారులకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందిస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అనే విషయాన్ని చాటిచెబుతున్నాయి. నాడు చెట్లను నరకడం తప్ప నాటే వారు లేకుండే అనే భావన నుంచి నేడు అన్ని వర్గాల ప్రజలు కనీసం ఒక్కచెట్టునైనా పెంచాలనే ఆలోచనకు వచ్చారు.
ఫలితంగా అన్ని ప్రాంతాల్లో హరితహారం విజయవంతంగా కొనసాగడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటుఅవుతుంది. కొత్తూరు మండలం ఎస్బీ పల్లి, నందిగామ మండలం బుగ్గోనిగూడ గ్రామాలకు వచ్చే ప్రధానదారులకు ఇరువైపులా నాటిన మొక్కలు పెరిగి వృక్షాలుగా మారాయి. దారిపొడవునా వనాలను తలపిస్తున్నాయి. రాకపోకలు సాగించే వాహనదారులు, గ్రామాల ప్రజలను హరిత వృక్షాలు ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వం సంకల్పం నెరవేరుతుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.