రంగారెడ్డి, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, మహేశ్వ రం, కందుకూరు తదితర ప్రాంతాల్లో వరితోపాటు కూరగాయ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లగా.. మామిడి కాయలు నేలరాలాయి. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బండరావిరాల, చిన్నరావిరాల, పసుమాముల, అబ్దుల్లాపూర్మెట్, అనాజ్పూర్, ఇబ్రహీంపట్నం మండలంలోని శేరిగూడ, రాందాస్పల్లి, చింతపల్లిగూడ గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది.
అలాగే, మంచాల, యాచారం మండలాలతో పాటు మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్, ఆమగనల్లు, కందుకూరు, మహేశ్వరం మండలాల్లోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. పలుచోట్ల హోర్డింగ్లు గాలికి లేచిపోయాయి. అకాల వానతో పలుచోట్ల రోడ్లపై నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం ఇబ్రహీంపట్నం సంత ఉండడంతో రోడ్లపై ఏర్పాటుచేసిన కూరగాయలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. అలాగే, ఎండుమిర్చి సైతం తడిసిపోవడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు.
విరిగిపడిన మునగ, నేలకొరిగిన బొప్పాయి
కేశంపేట : మండలంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వానకు పలు గ్రామా ల్లో కూరగాయ పంటలు దెబ్బతినగా తొమ్మిదిరేకులలో బొప్పాయి, మునగతోట నేలకొరిగింది. గ్రామానికి చెందిన రాంరెడ్డి అనే రైతు రెండు ఎకరాల్లో బొప్పాయి, మరో రెండు ఎకరాల్లో మునగతోట నాటాడు. అప్పులు చేసి తోటలు సాగు చేశానని.. అకాల వర్షానికి 150 మునగ చెట్లు, 100 వరకు బొప్పాయి నెలకొరిగిందని.. దాదాపుగా రూ. 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్య క్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలన్నాడు.