షాబాద్, జనవరి 28 : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున గురుకులాలను ప్రవేశపెట్టిందని.. కేజీ టూ పీజీ విద్యను అందించాలన్నదే సర్కార్ సంకల్పమని మంత్రి సబితారెడ్డి అన్నారు. ప్రవాస భారతీయులు భాస్కర్రావు, శ్యామలవారి సౌజన్యంతో శశిరావు ఫౌండేషన్ యూఎస్ఏ, టెక్సాస్వారి ఆధ్వర్యంలో మండల పరిధిలోని తోల్కట్టా గ్రామంలో రూ.2కోట్లతో అత్యాధునిక హంగులతో కార్పొరేట్ పాఠశాలను తలదన్నేలా నిర్మాణం చేపట్టిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను శనివారం ఎమ్మెల్సీ సురభివాణీదేవి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. విద్యలో రాష్ర్టాన్ని నం.1 స్థానంలో ఉంచాలన్నది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పెద్దసంఖ్యలో గురుకులాలను ప్రవేశపెట్టిందన్నారు.
విద్యార్థులకు ఉన్నత విద్యనందించాలనే లక్ష్యంతో డిగ్రీ, పీజీ, లా కళాశాలలను ప్రవేశపెట్టి ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గురుకుల పాఠశాలల్లో చేరడానికి ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ప్రవేశం పొందడానికి పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అన్ని రకాల సౌకర్యాలు, వసతులు కల్పించడం కోసం మన ఊరు-మన బడి కార్యక్రమం కింద మొదటి విడుతలో ఎక్కువ శాతం విద్యార్థులు ఉన్న పాఠశాలలను ఎంపిక చేసుకుని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. డిజిటల్ క్లాస్లను టీ శాట్ ద్వారా నిర్వహించనున్నట్లు చెప్పారు.
ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేక వెబ్సైట్
ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ను రూపొందించినట్లు.. దేశంలోని పేద విద్యార్థులను ప్రోత్సహించడానికి ఆసక్తి ఉన్నవారు వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చని మంత్రి తెలిపారు. విదేశాల్లో ఉన్న భాస్కర్రావు కుటుంబ సభ్యులు విద్యను ప్రోత్సహించడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. తోల్కట్టా గ్రామంలో పేద విద్యార్థులు చదువుకోవడానికి అత్యాధునిక హంగులతో ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మించడం అభినందనీయమని చెప్పారు. అమెరికాలో నివాసముంటూ భవన నిర్మాణ పనులను జూమ్ ద్వారా పర్యవేక్షించడం గొప్ప విషయమన్నారు. ప్రవాస భారతీయులు విద్యను ప్రోత్సహించే విషయమై మంత్రి కేటీఆర్, తాను ప్రత్యేక సమావేశంలో చర్చించామని తెలిపారు. సర్కారు బడులను బలోపేతం దిశగా కొంతమంది స్వచ్ఛందంగా వెబ్సైట్ ద్వారా సంప్రదిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో ప్రజాప్రతినిధులు సమావేశాలకు వచ్చే ముఖ్య అతిథుల సన్మానాల కోసం శాలువాలు, బొకేలు తీసుకురాకుండా విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్ అందజేయాలని సూచించారు. ఫౌండేషన్ ద్వారా భవన నిర్మాణం పూర్తయిందని.. ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ మంత్రి సబితారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె సానుకూలంగా స్పందించారు.
కార్యక్రమంలో ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్, ఎంపీడీవో సంధ్య, ఎంఈవో వెంకటయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎంఏ రవూఫ్, ఎంపీటీసీల ఫోరం మండల అద్యక్షుడు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయవంత్, కో ఆప్షన్ సభ్యుడు బిలాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్రాంరెడ్డి, ఉపాధ్యాయుడు భీంరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు మల్లేశ్, అర్జున్, రవీందర్, ఉపసర్పంచ్ రవీందర్రెడ్డి, నాయకులు రాజు, ప్రవీణ్రెడ్డి, అంజయ్యగౌడ్, పరమేశ్, ఆంజనేయులుగౌడ్, రాఘవేందర్, రాంరెడ్డి, రమేశ్, రాజుగౌడ్ ఉన్నారు.