రంగారెడ్డి, జూన్ 11 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జిల్లా అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. జిల్లాలో 131 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 55,032 మంది అభ్యర్థులకుగాను 32,553 మంది పరీక్ష రాసినట్లు 22,479 మంది గైర్హాజరైనట్లు.. 59.15శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు. అయితే, జిల్లాలో ఏర్పాటు చేసిన పలు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ హరీశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అభ్యర్థులు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత సమయంలోనే ప్రశ్నపత్రాలను తెరిచారా? లేదా? అన్నది సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి నిర్ధారించుకున్నారు. అభ్యర్థులను మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అధికారులు అనుమతించారు.
పల్లవి ఇంజినీరింగ్ కాలేజీ..
పెద్దఅంబర్పేట: మున్సిపాలిటీ పరిధి కుంట్లూరులోని పల్లవి ఇంజినీరింగ్ కాలేజీ, అబ్దుల్లాపూర్మెట్ మండలంలో ఏర్పాటు చేసిన పలు గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను కలెక్టర్ హరీశ్ పరిశీలించారు. ఆయన వెంట వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ అనితారెడ్డి, సీఐ ఉన్నారు. అబ్దుల్లాపూర్మెట్ ఠాణా పరిధిలో ఏడు కేం ద్రాలుండగా అందులో 4,968 మంది అభ్యర్థులు పరీక్ష రా యాల్సి ఉండగా.. 2,724 మంది పరీక్షకు హాజరయ్యారు.
ఇబ్రహీంపట్నంలో ..
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం పరిధిలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష సజావుగా సాగింది. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల పోలీస్స్టేషన్ల పరిధిలో 21 కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులతో శ్రీఇందు ఇంజినీరింగ్ కళాశాల వద్ద సాగర్ రహదారిపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. కేంద్రాలను ఆర్డీవో వెంకటాచారి, ఏసీపీ ఉమామహేశ్వరరావు పర్యవేక్షించారు.
చేవెళ్లలో..
చేవెళ్లటౌన్ : చేవెళ్లలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష సజావుగా జరిగింది. చేవెళ్ల మండల కేంద్రంలో ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మొయినాబాద్లో..
మొయినాబాద్ : గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మండలంలో ఏడు పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పా టు చేయగా 3,552 మందికి గాను 2,130 మంది పరీక్ష రాశారు. మొయినాబాద్ ఇన్స్పెక్టర్ డీకే లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కేంద్రాలను చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవరావు, చేవెళ్ల ఏసీపీ పర్యవేక్షించారు.
వికారాబాద్లో 15 కేంద్రాల్లో..
వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో గ్రూప్-1 పరీక్ష ఆదివారం సజావుగా సాగింది. జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4,857 మంది అభ్యర్థులకుగాను 3,400 మంది పరీక్ష రాయగా 1,457 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. 70 శాతం మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.